వరంగల్ అర్బన్: ఈటల రాజేందర్ బీజేపీలో చేరడంపై హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు మండిపడుతున్నారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఆరుసార్లు గెలిచానని గొప్పలు చెప్పుకోవడమే తప్ప నియోజకవర్గ ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. కమలాపూర్ మండల ఇంచార్జి పేరియాల రవిందర్ రావుతో కలిసి కమలాపూర్ మండలంలోని అంబాలలో టీఆర్ఎస్ కార్యకర్తలతో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం వదిలేసి సొంత లాభాలకోసమే ఈటల రాజేందర్ పనిచేశారన్నారు. ఆయనది ఆత్మగౌరవ పోరాటం కాదని కేవలం అస్తిత్వ పోరాటమే అని విమర్శించారు. బీజేపీలో చేరిన ఈటల ప్రజలకు సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పారు.
సీఎం కేసీఆర్ ప్రజాప్రతినిధులకిచ్చే అపారమైన గౌరవమిస్తారని వెల్లడించారు. ముఖ్యమంత్రిని విమర్శిస్తే సహించేదిలేదని అన్నారు. హుజురాబాద్ గడ్డ టీఆర్ఎస్ అడ్డ అని, ఎవరెన్ని ఎత్తులు వేసిన గులాబీ పార్టీని ఏమీచేయలేరన్నారు.