హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): స్పుత్నిక్- వీ టీకాను వచ్చేనెల రెండోవారం లో ప్రజలకు అందుబాటులోకి తేనున్నట్టు డాక్టర్ రెడ్డీస్ తెలిపింది. మొత్తం 25 కోట్ల డోసులు ఉత్పత్తి చేసేందుకు రష్యా సంస్థతో ఒప్పందం చేసుకున్నామని వెల్లడించింది. ఇప్పటివరకు రెండుబ్యాచ్ల్లో మొత్తం 2.10లక్షల స్పుత్నిక్-వీ టీకాలు త మకు అందాయని, ఇటీవలే హైదరాబాద్లో ఈ టీకాను లాంఛనంగా ప్రారంభించినట్టు గుర్తుచేసింది. మరికొన్ని నగరాల్లోనూప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పింది. వాణిజ్యపరమైన సరఫరాను జూన్ రెండోవారంలో ప్రారంభిస్తామని, అప్పటి నుంచే అందుబాటులోకి వస్తుందని వివరించింది.
స్పుత్నిక్- వీ టీకాను ‘-18 డిగ్రీ సెంటీగ్రేడ్’ ఉష్ణోగ్రతల వద్ద నిల్వ, సరఫరా చేయాలని డాక్టర్ రెడ్డీస్ తెలిపింది. ఈ మేరకు 25 కోట్ల డోసులకు నిల్వ, సరఫరా చేసేలా కోల్డ్ చెయిన్ అందుబాటులో ఉన్నదని పేర్కొన్నది. వ్యాక్సిన్ +2 డిగ్రీల నుంచి +8 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతల మధ్య నిల్వ ఉంటుందా? అనే కోణంలో పరిశోధనలు చేస్తున్నామని, ఇంకా ఫలితాలు రాలేదని వివరించింది. ఒకవేళ విజయవంతం అయితే దేశంలోని అన్ని మూలలకు వేగంగా, సురక్షితంగా వ్యాక్సిన్లను సరఫరా చేయవచ్చని అభిప్రాయపడింది. ప్రస్తుతం దిగుమతి చేసుకున్న టీకా ధర రూ.948 తోపాటు 5 శాతం జీఎస్టీగా నిర్ణయించామని, దేశీయ ఉత్పత్తి ప్రారంభం అయితే ధర తగ్గే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది.