ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తున్నది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల సంఖ్య పెరుగుతున్నది. రోజువారీ కరోనా కేసుల నమోదు 15 వేలు దాటింది. గురువారం నుంచి శుక్రవారం వరకు కొత్తగా 15,817 కరోనా కేసులు, 56 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 22,82,191కు, మరణాల సంఖ్య 52,723కు చేరింది. ముంబై నగరంలో గరిష్ఠంగా 1,646 కొత్త కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదయ్యే కరోనా కేసుల్లో 90 శాతం అపార్ట్మెంట్ నివాసితులేనని, మురికివాడల్లో కేసుల నమోదు పది శాతమేనని బీఎంసీ అధికారులు తెలిపారు.
మరోవైపు మహారాష్ట్రలో గత 24 గంటల్లో 11,344 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 21,17,744కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,10,485 యాక్టివ్ కేసులు ఉన్నట్లు పేర్కొంది. కరోనా తీవత్ర నేపథ్యంలో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో లాక్డౌన్ను మరింత కఠినంగా అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కాగా, దేశవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాల సంఖ్యలో మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతున్నది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.