హైదరాబాద్ పిల్లల్లో తక్కువగా ఫ్యాటీ ఆమ్లాలు
ఎన్ఐఎన్ తాజా అధ్యయనంలో వెల్లడి
హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): హృదయ సంబంధిత వ్యాధుల నివారణ, రోగనిరోధక శక్తి పెంచటంలో కీలకంగా వ్యవహరించే ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు హైదరాబాద్ పిల్లల్లో తక్కువగా ఉన్నాయట. జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) తాజాగా నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. శరీరానికి కావాల్సిన ఫ్యాటీ ఆమ్లాలు తక్కువగా ఉన్నాయని, చేపలు వంటి ఆహారం తీసుకోకపోవటమే ఇందుకు కారణమని ఎన్ఐఎన్ తెలిపింది. ‘హైదరాబాద్లోని ఐదు వేర్వేరు పాఠశాలల్లో 7-13 ఏండ్ల 625 మంది పిల్లలను పరిశీలించగా వారు తీసుకొనే ఆహారంలో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు తక్కువగా ఉన్నట్లు తేలింది. వీరిలో 80 శాతం పిల్లలు నెలకు వంద గ్రాములు మాత్రమే చేపలు తింటున్నారు. 4 శాతం మంది మాత్రమే చేపలను ఎక్కువగా తీసుకొంటున్నారు. పిల్లలకు వారానికి 100 గ్రాముల నుంచి 200 గ్రాముల చేపలు తినిపించాలని శాస్త్రవేత్తలు తెలిపారు. శరీరానికి అవసరమైన మంచి కొవ్వును సరఫరా చేసే చేపలతో పాటు మాంసం, చికెన్, కోడిగుడ్లు తీసుకోవాలని సూచిస్తున్నారు. పరిశీలనలో పాల్గొన్న పిల్లల్లో 96 శాతం మంది మాంసాహారులే అయినా వారిలో చేపలు తినేవారు తక్కువగా ఉన్నట్టు శాస్త్రవేత్త డాక్టర్ పీ దేవ్రాజ్ తెలిపారు. శాకాహారులైతే పప్పులు, నూనెగింజలు ఎక్కువగా తీసుకోవాలని ఐసీఎంఆర్-ఎన్ఐఎన్ డైరెక్టర్ ఆర్ హేమలత పేర్కొన్నారు.