కారేపల్లి రూరల్, ఏప్రిల్ 27 : మద్యం మత్తులో ఓ వ్యక్తి మతిస్థిమితం వృద్ధురాలిని దారుణంగా హతమార్చిన సంఘటన ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో చోటుచేసుకుంది. మండల పరిధిలోని బజ్యాతండాకు చెందిన అజ్మీరా నాజి (68) అనే వృద్ధురాలు మతిస్థిమితం కోల్పోయి కారేపల్లి వీధుల్లో తిరుగుతూ ఉంటుంది. రెండు రోజుల క్రితం కారేపల్లి అంబేద్కర్ నగర్కు చెందిన ఆదెర్ల ఉపేందర్ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించటంతో ఈ విషయాన్ని చుట్టుపక్కల వారికి చెప్పింది. దీంతో తన పరువు తీసిందన్న కక్షతో ఉపేందర్ ఆ వృద్ధురాలిని పథకం ప్రకారం సోమవారం చీమలపాడు అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి హత్యచేశాడు.
సైకోలా మారి నాజి తలను, మొండేన్ని వేరుచేసి కాళ్లు, చేతులు నరికేశాడు. హత్యచేసిన ప్రదేశంలోనే కాళ్లు, చేతులు, తలను తగులబెట్టాడు. మొండేన్ని బస్తాలో మూటగట్టి ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లి గార్ల సమీపంలోని రైల్వే ట్రాక్ మధ్యలో పడేశాడు. ఓ యువకుడి ద్వారా సమాచారం తెలుసుకొన్న పోలీసులు ఉపేందర్ను అదుపులోకి తీసుకుని విచారించటంతో నేరాన్ని అంగీకరించాడు. ఘటనాస్థలాన్ని ఖమ్మం రూరల్ ఏసీపీ వెంకటరెడ్డి పరిశీలించారు.