రాజన్న సిరిసిల్ల : వచ్చే నెలలో 57 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనం ప్రారంభోత్సవం అనంతరం సీఎం మాట్లాడుతూ.. గతంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా వృద్ధాప్య పింఛన్లపై చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. పల్లె ప్రగతి కార్యక్రమం తర్వాత క్యాబినెట్ మీటింగ్లో చర్చించి ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటామని సీఎం వెల్లడించారు.
వృద్ధాప్య పింఛన్కు కనీస వయసు అర్హతను 60 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, బోధకాల వ్యాధిగ్రస్తులు, నేత, గీత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు రూ.2,116, అదే దివ్యాంగులకు రూ.3,116 ను ప్రభుత్వం పింఛనుగా అందజేస్తుంది.