యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆయిల్ ఫామ్ పంటల సాగుకు అనుమతిని ఇవ్వాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతారెడ్డి మంత్రులకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్, డీసీసీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి, ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డితో పాటు జిల్లా ఎమ్మెల్సీ, ప్రజా ప్రతినిధు లతో కలిసి మంత్రుల నివాసంలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి, విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు.
జిల్లాలో సారవంతమైన ఎర్రటి నేలలు, పుష్కలమైన నీటి వనరులతో పాటు గంధమల్ల, బస్వాపూర్ ప్రాజెక్టు నిర్మాణం దాదాపుగాద పూర్తయ్యే దశలో ఉన్నాయని, ఈ ప్రాజెక్టు ద్వారా జిల్లాకు సంపూర్ణంగా నీటి సదుపాయం లభించడంతో పాటు పిలాయిపల్లి, ధర్మారెడ్డి, బీమలింగం, బునాదిగానీ కాల్వ, మూసీ నది పరివాహక ప్రాంతానికి సమృద్ధిగా నీరు అందుతుందన్నారు.
వంటనూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించే లక్ష్యంతో భారత ప్రభుత్వం రాష్ట్రంలో అదనంగా 25 జిల్లాలో 8 లక్షల పై చిలుకు ఎకరాల విస్తీర్ణంలో అయిల్ ఫామ్ సాగు చేయడానికి అనుమతులు కల్పిస్తూ ప్రకటన జారీ చేసిందన్నారు. ఆయిల్ ఫామ్ సాగు విస్తరణకు, నర్సరీల ఏర్పాటుకు, ఫ్యాక్టరీల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 2020, మార్చి 2021 నెలల్లో 15 ఆయిల్ ఫామ్ కంపెనీలకు జిల్లాల కేటాయింపు కూడా తమరి సమక్షంలో జరిగాయని వ్యవసాయ మంత్రికి గుర్తు చేశారు. జిల్లా సమీపంలో గల జనగామ, సూర్యాపేట, నల్లగొండ, సిద్దిపేట, మహబూబాబాద్ జిల్లాలకు ఆయిల్ ఫామ్ సాగు విస్తరణకు అవకాశం లభించిందన్నారు.
నేలల స్వభావంలో గానీ, నీటి వనరుల లభ్యతలో గానీ యాదాద్రి భువనగిరి జిల్లాకు, సమీప జిల్లాలకు ఎలాంటి వ్యత్యాసం లేదన్నారు. వరి, పత్తి, మొక్కజోన్న లాంటి సాంప్రదాయ పంటలపై ఆధారపడే రైతులు ఆయిల్ ఫామ్ పంటసాగుకు ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. పంట మార్పిడిలో భాగంగా ఆధిక ఆదాయాన్నిచ్చే ఆయిల్ పామ్ పంట సాగు చేస్తే జిల్లా రైతుల ఆర్థిక స్థితి గతులు మెరుగు పడి, బంగారు తెలంగాణను సాధించేందుకు జిల్లా ముఖ్య భూమిక పోషిస్తుందన్నారు.
1993లో అయిల్ ఫామ్ పంట సాగు రాష్ట్ర ఆయిల్ ఫెడ్ ప్రభుత్వ రంగ సంస్థ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలోని విజయవంతంగా సాగు చేస్తున్నారని గుర్తు చేశారు. దీంతో సుమారు 50,000 ఎకరాల విస్త్రీర్ణంలో అయిల్ ఫామ్ కేవలం ఆ రెండు జిల్లాలోనే సాగవుతుందని మంత్రులకు వివరించారు. విన్నపాన్ని మన్నించి యాదాద్రి భువనగిరి జిల్లాకు ఆయిల్ ఫామ్ సాగు విస్తరణంలో కేటాయింపు జరపాలని, పంటను సాగు చేసుకునే అవకాశాన్ని కల్పించి జిల్లా రైతుల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచే దిశగా చర్యలను చేపట్టారని కోరారు.