కరోనా కష్టకాలంలోనూ కర్షకులకు అండగా ముఖ్యమంత్రి కేసీఆర్
నేటి నుంచే ఖాతాల్లో వానకాలం పెట్టుబడి జమ
ఉమ్మడి జిల్లాలో 8,22,141 మంది రైతులకు లబ్ధి
ఆర్వోఎఫ్ఆర్ భూములకు సైతం పెట్టుబడి
ఇక జోరందుకోనున్న సాగు పనులు
వరంగల్, జూన్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రాధాన్యమి స్తున్నారు. రైతులకు పెట్టుబడి ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు రైతుబంధు పథకం ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నారు. కరోనా నేపథ్యంలో లాక్డౌన్ కారణంగా ప్రభుత్వానికి ఆదాయం తగ్గినా, అన్నదాతలకు నిరాటంకంగా రైతుబంధును జమచేస్తున్నారు. ఈ క్రమంలో వానకాలం పెట్టుబడి సాయం నేటి నుంచి 25వ తేదీ వరకు రైతుల ఖాతాల్లో జమకానుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 8,22,141 మంది రైతులకు ఈ వానకాలం సీజన్లోనే రూ.883 కోట్ల సాయం అందనుంది.
25లోగా నగదు జమ
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు ప్రతి ఎకరాకు సాగునీరు, ఉచితంగా నిరంతర విద్యుత్ ఇస్తున్నది. పెట్టుబడి సమస్య లేకుండా ‘రైతు బంధు’ సాయం అందిస్తున్నది. రైతులు సొంతంగా పెట్టుబడి ఖర్చులు సమకూర్చుకునేదాకా ఈ పథకాన్ని అమలు చేస్తామని స్పష్టం చేసింది. ఈ దిశగానే ప్రతి సీజన్లో ఎకరాకు రూ.5 వేల చొప్పున పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నది. వానకాలం, యాసంగి ఆరంభంలోనే ఖాతాల్లో డబ్బు జమవుతున్నది. ఈ వానకాలం సీజన్కు మంగళవారం నుంచి దశల వారీగా రైతులకు పెట్టుబడి సాయం అందనుంది. జూన్ 15 నుంచి 25 వరకు రైతు ఖాతాల్లో నేరుగా నగదు జమ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. భూ రికార్డుల్లోని సాగు విభాగంలో ఉన్న ప్రతి భూమికి రైతుబంధు సాయం అందించేలా వ్యవసాయ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. భూ రికార్డుల ప్రక్షాళన అనంతరం ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు 16.50 లక్షల ఎకరాల సాగు భూమి ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి.
ఇటీవల జరిగిన భూముల అమ్మకాలు, కొనుగోళ్లు, సాగు భూమి నుంచి ఇతర అవసరాల కోసం మారిన భూముల వివరాలను అధికారులు అప్డేట్ చేశారు. దీంతో గత సీజన్ కంటే రైతుల సంఖ్య పెరిగింది. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో కలిపి 8,22,141 మంది రైతులకు వానకాలం పెట్టబడి సాయం అందనుంది. పార్ట్ బీ నుంచి పార్ట్ ఏలోకి చేరిన భూములకు కూడా రైతుబంధు సాయం అందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. జూన్ 10లోపు ఈ ప్రక్రియ ముగిసిన ప్రతి సాగు భూమి ఉన్న రైతుకు పెట్టుబడి సాయం జమచేసేలా ఏర్పాట్లు చేశారు.
ఆర్వోఎఫ్ఆర్ భూములకు సైతం..
అటవీ భూముల్లో సాగు చేసుకునే ఆర్వోఎఫ్ఆర్ భూములకు సైతం రైతుబంధు సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ములుగు జిల్లాలో 5,425 మంది ఆర్వోఎఫ్ఆర్ రైతులకు రూ.7.57 కోట్ల సాయం అందనుంది. ఆర్వోఎఫ్ఆర్లో ఎకరా కంటే తక్కువ ఉన్న రైతులు 916 మంది ఉన్నారు. వీరికి రూ.30.15 లక్షలు ఇవ్వనున్నారు. మహబూబాబాద్లో యాసంగికి ఇప్పటికి 2,371 మంది రైతులు పెరిగారు. వరంగల్ రూరల్ జిల్లాలో ఎకరం భూమిలోపు ఉన్న రైతులు 58,751 మంది ఉన్నారు. వీరికి తొలి విడతలోనే రూ.18.34 కోట్లు జమ కానున్నాయి. పోడు భూముల్లో ఎన్నో ఏళ్లుగా వ్యవసాయం చేసుకుంటున్న గిరిజన రైతులకు సీఎం కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో ఊరట కలిగించింది.