గజ్వేల్ అర్బన్, మార్చి25: గజ్వేల్ మండలం బూర్గుపల్లిలో ప్రజలు గురువారం కూడవెల్లి వాగులో నీళ్ల పండుగ నిర్వహించుకున్నారు. సర్పంచ్ విజయవర్ధ్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, గజ్వేల్, వంటిమామిడి ఏఎంసీ చైర్మన్లు అన్నపూర్ణా శ్రీనివాస్, జహంగీర్, ఎంపీపీ అమరావతి, జడ్పీటీసీ పంగమల్లేశం, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గ్రామస్తులంతా డప్పుచప్పుళ్లతో చెక్డ్యాంక్కు తరలివెళ్లారు. చెక్డ్యాం వద్ద నీటిలో దిగి గోదావరి జలాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన పసుపు,కుంకుమ చల్లి, పువ్వులు సమర్పించారు. మహిళలు, చిన్నారులు వాగులోకి చేరుకున్న నీటిని ఒక్కరిపై ఒక్కరూ చల్లుకుంటూ సంబురపడిపోయారు. ప్రజాప్రతినిధులు సైతం కూడవెల్లివాగులోనికి కాళేశ్వరం జలాలు రావడంతో ఆనీటిని ఒక్కరిపై ఒక్కరూ చల్లుకుంటూ సంతోషంగా గడిపారు.
ఈ సందర్భంగా ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి మాట్లాడుతూ 240కిలోమీటర్ల నుంచి 600ల మీటర్ల ఎత్తుకు పంపింగ్ ద్వారా మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్లను కాళేశ్వరం గోదావరి జలాలను నింపిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. మంత్రి హరీశ్రావు మూడు రోజుల క్రితమే మల్లన్నసాగర్ కాల్వ నుంచి కూడవెల్లి వాగులోకి నీటిని విడుదల చేశారన్నారు. కాళేశ్వరం గోదావరి జలాలతో కొడకండ్ల, రిమ్మనగూడ, బూర్గుపల్లి చెక్డ్యాంలు నిండాయని, రేపు సింగాటం, అహ్మదీపూర్, తొగుట దుబ్బాక తదితర చెక్డ్యాంలు నిండి హయ్యర్ మానేరు వరకు వెళ్తాయన్నారు. దాదాపు11వేల ఎకరాల్లోని వరిపంటలకు నీరులేక ఎండిపోతుండడంతో సీఎం కేసీఆర్ ప్రత్యేకచొరవతో నీటిని విడుదల చేసి పంటలను కాపాడుకుంటున్నామన్నారు.
మరో రెండు మూడు రోజుల్లో 140కిలోమీటర్లు పొడవు ఉండే కూడవెల్లి వాగులో పూర్తిస్థాయిలో గోదావరి జలాలతో 36చెక్డ్యాంలు నిండుకుని హయ్యర్ మానేరు వరకు వెళ్తాయన్నారు. సీఎం కేసీఆర్ కారణ జన్ముడని, మండుటెండలు.. వాగుల్లో నీరు ప్రవహించే దృశ్యాలు గతంలో తెలంగాణలో ఎక్కడా చూడలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 40లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తూ సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేశారన్నారు. గజ్వేల్ నియోజకవర్గ ప్రజలందరి తరుఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జకీయొద్దీన్, సీనియర్ నాయకులు డాక్టర్ యాదవరెడ్డి, మాదాసు శ్రీనివాస్ ఆత్మ కమిటీ చైర్మన్లు చిన్నమల్లయ్య, రంగారెడ్డి ,ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, బూర్గుపల్లి గ్రామ ప్రజలు పాల్గొన్నారు.