మేడ్చల్, మే 6 (నమస్తే తెలంగాణ): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దేవరయాంజాల్లోని దేవాదాయ భూములపై ఐఏఎస్లతో కూడిన ప్రత్యేక విచారణ కమిటీ నాలుగో రోజు బుధవారం శ్రీసీతారామస్వామి ఆలయంలో విచారణను కొనసాగించింది. భూములకు సంబంధించి ఆలయంలో ఉన్న పలు రికార్డులను సీనియర్ ఐఏఎస్ అధికారి రఘునందన్రావు నేతృత్వంలోని కమిటీ పరిశీలించింది. వీటిపై గత ప్రభుత్వాలు ఇచ్చిన జీవోలను క్షుణ్ణంగా అధ్యయనం చేసింది. అక్రమ నిర్మాణలపై సర్వే ఆధారంగా దేవాదాయ, రెవెన్యూ రికార్డులను పరిశీలించింది. కమిటీ ఆదేశాలతో మేడ్చల్ మాల్కాజిగిరి జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన 8 మండలస్థాయి అధికారుల బృందాలు సర్వేను పూర్తిచేశాయి. దీని ఆధారంగా భూముల ఆక్రమణలు, వాటిల్లో నిర్మాణాలకు సంబంధించిన సర్వే నంబర్లను అధికారులు నిర్ధారించారు. మొత్తం 91 సర్వే నంబర్లలోని 1,525 ఎకరాల్లో హకీంపేట్ ఎయిర్పోర్ట్, డీఎంసీకి ఇచ్చిన భూములను మినహాయించి.. మిగిలిన భూముల సర్వే పూర్తిచేశారు. ఇందులో 160 అక్రమ నిర్మాణాలు ఉన్నట్టు అధికారులు నిర్ధారించిన విషయం తెలిసిందే.
అవి ఆలయ భూములే
శామీర్పేట మండలంలో దేవరయాంజాల్లో గోదాము లు, ఇతర షెడ్లు నిర్మించిన భూములన్నీ శ్రీసీతారామస్వామి ఆలయానికి సంబంధించిన దేవాదాయ భూములేనని గ్రామస్థులు స్పష్టంచేస్తున్నారు. ఆలయాన్ని కాకతీయుల కాలంలో నిర్మించారని పేర్కొన్నారు. 1925లో తనవద్ద పనిచేసే రామిడి పుల్లయ్య విజ్ఞప్తి మేరకు నిజాంనవాబు సీతారామస్వామి దేవాలయానికి భూములను కేటాయించారని తెలిపారు. అప్పటినుంచి పహణీలో సీతారామస్వామి పేరిటే భూమి ఉండేదని.. తర్వాత ఎలా మారిపోయిందో తమకు తెలియదని చెప్తున్నారు. మాజీ మంత్రి ఈటల కనుసన్నల్లోనే పలు గోదాముల నిర్మాణం జరిగిందని ఆరోపిస్తున్నారు.