హైదరాబాద్, జూలై1 (నమస్తే తెలంగాణ): మన కొలువులు మనవారికే దక్కేలా కొత్త జోనల్ వ్యవస్థ అమల్లోకి వచ్చింది. ఇక పదోన్నతులు, నియామకాలపై మరింత ముందుకెళ్లేలా రాష్ట్ర ప్రభుత్వం క్యాడర్ స్ట్రెంత్ రూపకల్పనపై దృష్టి సారించింది. 32 శాఖలు, 85 హెచ్వోడీలకు జిల్లా, జోనల్, మల్టీజోనల్, రాష్ట్రస్థాయి క్యాడర్స్ట్రెంత్ రూపకల్పన జరుగుతున్నది. అలాగే ప్రతి కలెక్టరేట్లో ఉండాల్సిన శాఖలు, అధికారులు, సిబ్బంది తదితర పోస్టులను కూడా నిర్ణయిస్తున్నారు. ఇలా రాష్ట్రంలో ప్రతి కార్యాలయానికి ఎన్ని సెక్షన్లు ఉండాలి, ఏ సెక్షన్లో ఎంతమంది సిబ్బంది ఉండాలన్నది రూపొందిస్తున్నారు.
రాష్ట్రపతి సవరణ ఉత్తర్వులకు ఆమోదం లభించడంలో ఆలస్యం కావడంతో రాష్ట్రంలో ఇప్పటిదాకా పాత జోనల్ విధానమే అమలులో ఉన్నది. పాత జోనల్ విధానం 10 జిల్లాలు, రెండు జోన్లకు మాత్రమే పరిమితం కావడంతో తెలంగాణ నిరుద్యోగులకు ఉపయోగపడేలా ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. గ్రూప్-1 నోటిఫికేషన్లు విడుదలకు నోచుకోలేదు. స్వరాష్ట్రంలో ఉద్యోగాలన్ని స్థానికులకే దక్కేలా ప్రభుత్వం సుదీర్ఘ కసరత్తు చేసింది. ఉద్యోగ, ఉపాధ్యాయసంఘాలతో చర్చించిన ప్రభుత్వం రాష్ట్రస్థాయి పోస్టులను పదోన్నతుల ద్వారానే భర్తీ చేయాలని నిర్ణయించింది.
ఈ మేరకు లోక్ల్ కోటాను 95 శాతానికి పెంచి.. ఓపెన్ కోటాను 5 శాతానికి పరిమితం చేసింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ, జోనల్ వ్యవస్థ ఏర్పాటుతో జరుగుతున్న క్యాడర్ వర్గీకరణ ఆధారంగానే పదోన్నతులు, నూతన నియామకాలు జరుగుతాయి. ఒకేనెలలో భారీఎత్తున ఇచ్చిన పదోన్నతుల ద్వారా ఇప్పటికే అనేక ఖాళీలు ఏర్పడ్డాయి. దాదాపు 50 వేల ఉద్యోగాలు భర్తీచేయడానికి సర్కారు సిద్ధమైంది.