హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ఆదివాసీలు, గిరిజనుల్లో పౌష్టికాహార లోపాన్ని శాశ్వతంగా రూపుమాపేందుకు ప్రభు త్వం గిరిపోషణ్ పేరుతో బలవర్ధకమైన ఆహారాన్ని అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆదివాసీల ఆహార అలవాట్లకు, వారి ప్రాంతాల్లో పండే పంటలు, అక్కడ లభ్యమయ్యే ఉత్పత్తులకు అదనపు పౌష్టిక విలువలు జోడించి అందివ్వనున్నది. గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ఇక్రిశాట్తో కలిసి ఇప్పటికే నాణ్యమైన, రుచికరమైన పౌష్టికాహారాన్ని (గిరిబ్రాండ్) సిద్ధం చేసింది. పర్టిక్యులర్లీ వల్నరబుల్ గ్రూప్స్ (పీవీటీ) నుంచి మొదలు పెట్టి దశలవారీగా రాష్ట్రంలోని నాలుగు ఐటీడీఏల పరిధిలో ఉన్న ఆదివాసీలు, గిరిజనులకు ఈ పౌష్టికాహారాన్ని సరఫరా చేస్తారు. ఇందుకోసం గిరిజన సంక్షేమశాఖ కార్యాచరణను సిద్ధంచేసింది. అటవీ, మైదాన ప్రాంతాల్లోని గిరిజన చిన్నారులకు ఈ పౌషికాహారాన్ని ప్రయోగాత్మకంగా ఇచ్చారు. ఉట్నూరు, ఏటూరునాగారం, భద్రాచలం ఐటీడీఏల పరిధిలోని 12 మండలాల్లో తొలిదశలో 7,501 మందికి, మలిదశలో 5,597కి అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు.
ఆరు నెలల తర్వాత ఈ ఆహారం తీసుకొన్న చిన్నారులు, బాలింతలు, గర్భిణుల్లో రక్తహీనత గణనీయంగా తగ్గింది. చిన్నారుల్లో ఎత్తు, ఎత్తుకు తగ్గ బరువు, జబ్బచుట్టుకొలత పెరుగుదల కనిపించింది. జీసీసీ పరిధిలోని స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులకు పౌష్టికాహారానికి అవసరమైన వస్తూత్పత్తి, ప్యాకేజీ, పంపిణీ వంటి అంశాల్లో ఇక్రిశాట్ ఇప్పటికే ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. బాలింతలు, గర్భిణులతోపాటు 3-6 ఏండ్ల పిల్లలకు పౌష్టికాహారం తయారు చేయించటం వల్ల స్వయం సహాయక సంఘాలకు ఉ పాధి కల్పించటం, పౌష్టికాహారాన్ని అందించటం అనే రెండు లక్ష్యాలు నెరవేరుతాయని అధికారులు భావించారు. దాంతో ఈ ద్విఫల సూత్రాన్ని అనుసరించారు. తొలుత కుమురం భీం-ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, నాగర్కర్నూల్ జిల్లాలో ఉన్న పీవీటీజీ తెగల్లోని కొలామ్, కొండరెడ్డి, థోటీ, చెంచులకు ఈ ఆహారాన్ని పంపిణీ చేస్తారు. ఆ తర్వాత రాష్ట్రంలోని గిరిజనులందరికీ అందిస్తారు. 533 ఆవాసాల్లోని దాదాపు 80వేల మందికి సంపూర్ణ పౌష్టికాహారం అందివ్వనున్నారు.
గిరిజన బిడ్డల సంపూర్ణ ఆరోగ్యం సీఎం కేసీఆర్ కల
రాష్ట్రంలో ప్రతీ ఒక్కరూ ఆరోగ్యంతో ఉండాలని సీఎం కేసీఆర్ పదేపదే చెప్తుంటారు. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే అటవీ, మైదాన ప్రాంతాల్లోని బాలింతలు, గర్భిణులు, చిన్నారుల్లో ఆరోగ్య సమస్యలు అధికం. దీన్ని గమనించి గిరిజనులకు పౌష్టికాహారం అందించేందుకు అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాం.