హైదరాబాద్ : సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో అంతరించిపోతున్న గిరిజన తెగలను కాపాడుకోవడం, వారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించడం కోసం ప్రభుత్వం పనిచేస్తుందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఆదిమ గిరిజన తెగలకు పౌష్టికాహారం అందించేందుకు 3వ దశ ప్రత్యేక గిరిపోషణ కార్యక్రమాన్ని సోమవారం దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్ లో మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…అంతరించిపోతున్న ఆదిమ గిరిజన తెగల కోసం ప్రత్యేక గిరిపోషణ కార్యక్రమం ప్రారంభించడం శుభపరిణామం అన్నారు. నేడు 584 గ్రామాల్లో 16,369 మంది ఆదిమ గిరిజన తెగలకు పౌష్టికాహారం అందించేందుకు 8 కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నాం. గిరిజన సంక్షేమం, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలు రెండు నా దగ్గర ఉండడం, ఈ కార్యక్రమం ఈ రెండు శాఖల సహకారంతో నిర్వహించేది కావడం నిజంగా అదృష్టమన్నారు.
ఆర్థికంగా దీనికి నిధులు ఉన్నా..దీనిని అమలు చేసే మహిళా, శిశు సంక్షేమ శాఖ సరిగా చేసినప్పుడే దీని ఫలితాలు గిరిజనులకు అందుతాయన్నారు. ఇందుకోసం వారికి అవసరమైన వసతులన్నీ కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
మూడున్నర కోట్లు గిరిజన సంక్షేమం నుంచి ఇస్తే, నాలుగున్నర కోట్ల రూపాయలు మహిళా, శిశు సంక్షేమ శాఖనుంచి ఇస్తూ దీనిని అమలు చేయనున్నామని తెలిపారు.
వీరికి ఇచ్చే నిధులతో పోషకాహారం తయారు చేయడం కోసం గ్యాస్ సిలిండర్లు, ప్రెషర్ కుక్కర్లు, తినడానికి గిన్నెలు, ఇచ్చిన ఆహార పదార్థాలను నిల్వ చేసుకునేందుకు డబ్బాలు ఇవ్వాలని నిర్ణయించామన్నారు.
గిరిజనులు, మహిళలు, గర్భిణులు, బాలింతలు, శిశువులకు పోషకాహారంలో తెలంగాణ ఒక రోల్ మోడల్ కావాలన్నది సీఎం కేసీఆర్ ఆలోచన అన్నారు. గర్భిణులకు దేశంలో అత్యంత భద్రతగల ప్రాంతంగా తెలంగాణ ఉందని యునిసెఫ్ ప్రతినిధులు చెప్పడం గర్వకారణమన్నారు.
కొవిడ్ కారణంగా ఆన్ లైన్ విద్యను సరిగా అందని విద్యార్థులకు విద్య అందించాలనే ఉద్దేశంతో 3 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఉపయోగపడే విధంగా గిరిజన సంక్షేమ శాఖ రూపొందించిన గిరిదర్శిని పుస్తకాలను మంత్రి ఆవిష్కరించారు.
గిరిజన పాఠశాలల్లో చదివే దాదాపు 5000 గిరిజన ఆవాసాలకు వీటిని పోస్ట్ ద్వారా పంపించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ పుస్తకాలతో పాటు స్టడీ మెటీరియల్, పెన్నులు, పెన్సిల్స్, స్కేల్, క్రేయాన్స్, కలర్ పెన్సిల్స్, లెర్నింగ్ కిట్ కూడా గిరిజన విద్యార్థులకు పోస్ట్ ద్వారా పంపుతున్నామన్నారు.
కార్యక్రమం అనంతరం దామోదర సంజీవయ్య భవన్ లో మంత్రి హరితహారంలో భాగంగా రుద్రాక్ష మొక్కను నాటారు. మంత్రితో పాటు గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్, కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తు, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనర్, ప్రత్యేక కార్యదర్శి దివ్య, ఉట్నూరు ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ భవేష్ మిశ్రా, గిరిజన శాఖ అదనపు సంచాలకులు సర్వేశ్వర్ రెడ్డి, సంయుక్త సంచాలకులు కళ్యాణ్ రెడ్డి, మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు లక్ష్మి, తదితర అధికారులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
టాయిలెట్లు శుభ్రం చేసిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
యాదాద్రిలో వైభవంగా లక్షపుష్పార్చన
ఆగని పెట్రో వడ్డన.. లీటర్పై 35 పైసలు పెంపు
హరితహారం దేశానికే స్ఫూర్తిదాయకం