హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గిరిజన తెగలకు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించి జీవన ప్రమాణాలను పెంచాలన్న ధ్యేయంతో ప్రభుత్వం పనిచేస్తున్నదని గిరిజన, స్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. రాష్ట్రంలోని 584 గ్రామాల్లో ఆదిమ గిరిజన తెగలకు చెందిన 16,369 మందికి పౌష్టికాహారాన్ని అందించేందుకు రూ.8 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు ఆమె వెల్లడించారు. పోషకాహారం తయారీ కోసం గ్యాస్ సిలిండర్లు, ప్రెషర్ కుక్కర్లు, గిన్నెలు, ఆహార పదార్థాలను నిల్వ చేసుకునేందుకు డబ్బాలు ఇవ్వాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. గిరిజనులకు పౌష్టికాహారాన్ని అందించే ‘గిరిపోషణ’ మూడోదశ కార్యక్రమాన్ని సోమవారం ఆమె హైదరాబాద్లోని దామోదర సంజీవయ్య భవన్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. మహిళలు, గర్భిణులు, బాలింతలు, శిశువులు, గిరిజనులకు పౌష్టికాహార పంపిణీలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలపాలన్నది సీఎం కేసీఆర్ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ లక్ష్య సాధనకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని మంత్రి సత్యవతి వెల్లడించారు.
గిరిజన విద్యార్థుల ఇండ్లకే స్టడీ మెటీరియల్
కొవిడ్ కారణంగా ఆన్లైన్ విద్యను అందుకోలేని విద్యార్థుల కోసం గిరిజన సంక్షేమ శాఖ రూపొందించిన గిరిదర్శిని (3వ తరగతి నుంచి 10వ తరగతి) పుస్తకాలను మంత్రి సత్యవతి రాథోడ్ ఆవిష్కరించారు. గిరిజన పాఠశాలల్లో చదివే 5 వేల మంది విద్యార్థుల ఇండ్లకు పోస్టు ద్వారా ఈ పుస్తకాలను పంపి ఆఫ్లైన్లో విద్యను అందించనున్నట్లు తెలిపారు. అనంతరం ఆమె హరితహారంలో భాగంగా సంజీవయ్య భవన్ ఆవరణలో రుద్రాక్ష మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో గిరిజన శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తూ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి దివ్యాదేవరాజన్, ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి భవేష్ మిశ్రా, గిరిజనశాఖ అడిషనల్ డైరెక్టర్ వీ సర్వేశ్వర్రెడ్డి, జాయింట్ డైరెక్టర్ కల్యాణ్రెడ్డి, డిప్యూటీ డైరెక్టర్లు చందన, ప్రియాంక, అకడమిక్ సెల్ ఓఎస్డీలు డీ సుధాకర్, టీ రాం లాల్, యాదయ్య, రుఖియా షాహీన్, శైలజ తదితరులు పాల్గొన్నారు.