రాజన్న సిరిసిల్ల : రాష్ట్రవ్యాప్త నర్సింగ్ విద్యార్థులకు సీఎం కేసీఆర్ తీపి కబురు అందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్మించిన నర్సింగ్ కళాశాలను సీఎం ఆదివారం ప్రారంభించారు. అక్కడి కళాశాల సిబ్బంది, విద్యార్థులతో కేసీఆర్ కాసేపు ముచ్చటించారు. విద్య, వసతులపై వైద్యాధికారులను ఆరా తీశారు. ఈ సందర్భంగా నర్సింగ్ విద్యార్థులు తమ స్టైఫండ్ సమస్యను సీఎం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై జిల్లా సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణం ప్రారంభం అనంతరం సీఎం మాట్లాడుతూ.. నర్సింగ్ విద్యార్థులకు తీపి కబురు అందించారు. మొదటి సంవత్సరం 1500 గా ఉన్న స్టైఫండ్ ను 5 వేలకు, రెండో సంవత్సరం 1700గా ఉన్న స్టైఫండ్ ను 6 వేలకు, మూడో ఏడాది 1900 గా ఉన్న స్టైఫండ్ ను 7 వేలకు పెంచుతూ సీఎం నిర్ణయం వెలువరించారు. కరోనా మహమ్మారి సమయంలో ప్రాణాలకు తెగించి పోరాటం చేసిన ఆశా వర్కర్లు, ఏఎన్ఎం, నర్సులు, డాక్టర్లు, ల్యాబ్ టెక్నిషియన్లు, పారా మెడికల్ సిబ్బందికి సీఎం కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు.