హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో అధిక మొత్తంలో పులులకు నెలవైన ప్రదేశం ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్. గతంలో 12గా ఉన్న పులుల సంఖ్య తాజా నివేదికలో 14కు చేరింది. ఆమ్రాబాద్ పులుల సంరక్షణ కేంద్రం వార్షిక నివేదికను రాష్ట్ర అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్.శోభ శుక్రవారం విడుదల చేశారు. ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో మొత్తం 14 పులులను, 43 రకాల వన్యప్రాణులు అటవీ అధికారులు గుర్తించారు. పులుల సంఖ్య 2019లో 12గా ఉంది.
నాలుగు సంవత్సరాలకు ఒకసారి మొత్తం టైగర్ రిజర్వ్ ప్రధాన, బఫర్ ప్రాంతాలను అటవీ అధికారులు కెమెరాలతో కవర్ చేస్తుంటారు. తద్వారా పులులను గుర్తిస్తుంటారు. దేశవ్యాప్తంగా ప్రతి టైగర్ రిజర్వులో పులుల సంఖ్యను తెలుసుకునేందుకు నాల్గొవ దశ పర్యవేక్షణ జరిగింది. ఈ క్రమంలో భాగంగానే మచ్చల జింకలు, సాంబార్, నీలగై, అడవి పందులు, నాలుగు కొమ్ముల జింక, చింకారా వంటి అటవీ జంతువుల జనాభా లెక్కింపు జరిగింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అటవీశాఖ అధికారులు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిచ్చి రాష్ట్రంలో పులుల సంతతి పెరిగేందుకు దోహదపడుతున్నాయి.