శేరిలింగంపల్లి, జూన్ 16 : శాంతిభద్రతల పరిరక్షణతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో పోలీసులు నిరంతర సేవలందిస్తున్నారని మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు అన్నారు. తలసీమియా రోగులకు రక్తనిధి సేకరణలో భాగంగా గచ్చిబౌలి పోలీస్స్టేషన్, గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్స్టేషన్ల అధ్వర్యంలో బుధవారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. గచ్చిబౌలి పోలీస్స్టేషన్ అవరణలో ఇన్స్పెక్టర్ గోన సురేశ్ అధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాదాపూర్ డీసీపీ ఎ.వెంకటేశ్వర్లు హాజరై ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ కొవిడ్-19 నేపథ్యంలో తలసీమియా రోగులకు రక్తదానం అందించేందుకు ఈ మేగా రక్తదాన శిబిరం ఏర్పాటుచేయగా 102 మంది రక్తదానం చేసినట్లు తెలిపారు. ఉస్మానియా రక్తనిధి కేంద్రం వైద్యబృందం సేకరించారు. మదాపూర్ ఏసీపీ సీహెచ్.రఘునందన్ రావు, గచ్చిబౌలి పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్ గోన సురేశ్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ నర్సింహారావులతో పాటు పలువురు ఏస్ఐలు, సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.