హైదరాబాద్ : వంశీ గ్లోబల్ అవార్డ్స్ ఇండియా, శారద ఆకునూరి అమెరికా సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన దర్శకరత్న డా. దాసరి నారాయణరావు 74 వ జయంతి కార్యక్రమాన్ని టెక్సాస్ హ్యూస్టన్ నగరంలో అమెరికా గాన కోకిల శారద ఆకునూరి జ్యోతి ప్రకాశం చేసి ప్రారంభించారు. అంతర్జాల వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో దాసరికి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. తెలుగు సినీ స్వర్ణయుగ కాలంలో పరిశ్రమలోకి అడుగుపెట్టిన దాసరి నారాయణరావు దర్శకత్వ శాఖకు కొత్త శోభను తీసుకొచ్చారు. దర్శకుడే కెప్టెన్ అఫ్ ది షిప్ అంటూ తెర వెనుక సృజనశీలురకు మహోన్నతమైన గౌరవాన్ని సంపాదించిపెట్టారన్నారు.
151 చిత్రాలకు దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించి అత్యధిక చిత్రాల దర్శకుడిగా గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకున్నారని ప్రశంసించారు. దర్శకుడిగా, నటునిగా, రచయితగా, నిర్మాతగా, గీత రచయితగా, పత్రికాధినేతగా , కార్మిక నాయకుడిగా రాజకీయవేత్తగా రాణించి బహుముఖ ప్రజ్ఞాశాలిగా అసమాన కీర్తి ప్రతిష్టలను సముపార్జించుకొన్నారని ప్రశంసించారు.
తెలుగు సినీ చరిత్రలో సువర్ణాధ్యాయాన్ని లిఖించుకున్న మహా మనిషి దాసరి అన్నారు. వంశీ గ్లోబల్ అవార్డ్స్ వ్యవస్థాపకుడు డా. వంశీ రామరాజు దాసరికి వంశీ సంస్థకి వున్న నాలుగు దశాబ్దాల అనుబంధాన్ని తెలియజేసారు.
సినీ నటుడు, నిర్మాత మురళీమోహన్, మండలి బుద్ధ ప్రసాద్, జమున చంద్రమోహన్, ప్రభ, తమ్మారెడ్డి భరద్వాజ, సుద్దాల అశోక్ తేజ, భువనచంద్ర, మాధవపెద్ది సురేష్, తుమ్మలపల్లి సత్యనారాయణ, కొండేటి సురేష్, ధవళ సత్యం, సంజీవి, రాజా వన్నెంరెడ్డి, సీవీ రమణబాబు, అల్లాణి శ్రీధర్, రేలండి నరసింహారావు వంటి ప్రముఖులు తమకు దాసరి ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు.
దాసరికి భారత రత్న ఇవ్వాలని కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులందరూ తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. డా. తెన్నేటి సుధాదేవి అధ్యక్షురాలు-వంశీ సంస్థ, శైలజ సుంకరపల్లి మేనేజింగ్ ట్రస్టీ వంశీ సంస్థ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
ఇవి కూడా చదవండి..
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ : మొక్కలు నాటిన శ్రీనివాస్ గుప్తా
అక్కడ మే 12 నుంచి సంపూర్ణ లాక్డౌన్..!
పీఎంవో వల్ల కాదు కానీ.. ఆ పని గడ్కరీకి అప్పగించండి: ప్రధానికి స్వామి సూచన