హైదరాబాద్ : తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ – సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో మూడురోజుల (ఆగస్టు 10, 11, 12) పాటు నిర్వహిస్తున్న నృత్యోత్సవం – 2021 ప్రారంభమైంది. నగరంలోని రవీంద్రభారతీలో జరుగుతున్న ఈ నృత్యోత్సవాన్ని సంగీత నాటక అకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్తో కలసి రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ మంగళవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కళలకు, కళాకారులకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారన్నారు. అందులో భాగంగా కాకతీయుల కాలం నాటి యుద్ధ కళ పెరణి నృత్యం కు పూర్వ వైభవాన్ని తీసుకవస్తున్నామన్నారు. కూచిపూడి, భరత నాట్యం, కథక్, జుగల్ బందీ, ఆంధ్ర నాట్యం లాంటి నృత్యాలను ప్రోత్సాహించాలనే లక్ష్యంతో ఈ నృత్యోత్సవంను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు హరికిషన్, రవీందర్ రావు, సంగీత నాటక అకాడమీ అధికారులు పాల్గొన్నారు.