టీఆర్ఎస్ ఎన్నారై ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ శాఖల అధ్యక్షులు
హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమ సమయం నుంచి బంగారు తెలంగాణ నిర్మాణం దాకా ఎప్పటికైనా తెలంగాణ ఎన్నారైలు ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట, టీఆర్ఎస్ వెంటే ఉంటారని టీఆర్ఎస్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఎన్నారైశాఖల అధ్యక్షులు కాసర్ల నాగేందర్రెడ్డి, వడ్నాల జగన్మోహన్ స్పష్టంచేశారు. మొదటి నుంచి టీఆర్ఎస్ను అస్థిరపరచాలని ఎంతోమంది, ఎన్నో కుట్రలు, కుతంత్రాలు చేసినా తెలంగాణ ఎన్నారైల ఆత్మాభిమానం టీఆర్ఎస్ వెంటే ఉంటుందని అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడింది.. కాపాడేది ముమ్మాటికీ సీఎం కేసీఆరేనని అన్నారు. తెలంగాణ సమాజానికి దేశంలో, ప్రపంచంలో ఇవ్వాళ ఈ మాత్రం గుర్తింపు, గౌరవం దక్కుతుందంటే దానికి కారణం సీఎం కేసీఆరేనని బుధవారం వేర్వేరు ప్రకటనలో పేర్కొన్నారు.
మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్లో ఉంటూ విపక్షాలతో చేతులు కలిపి పార్టీకి ద్రోహం చేశారని టీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈటల వ్యవహారంలో ఆయన యూఎస్ఏ ఎన్నారై కోర్ కమిటీ సభ్యులతో బుధవారం పరిస్థితిని సమీక్షించారు. అనంతరం మాట్లాడుతూ.. టీఆర్ఎస్లో ఉంటూనే పార్టీని కూల్చే ప్రయత్నం చేసి ఈటల విఫలం అయ్యారని అన్నారు. కరోనాను జయించిన సీఎం కేసీఆర్కు మహేశ్ శుభాకాంక్షలు తెలిపారు. సమీక్షలో పార్టీ ఎన్నారై కోర్ కమిటీ సభ్యులు మహేశ్ తన్నీరు, చందు తాళ్ల, పూర్ణ బైరి, శ్రీనివాస్ గనుగోని, వెంజల్ జలగం, భాస్కర్ పిన్న, మహేశ్ పొగాకు, రిషికేశ్రెడ్డి, వెంకట్గౌడ్ పాల్గొన్నారు.