హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): వెయిటింగ్ లిస్టులో ఉన్న ప్రయాణికులను ప్రయాణానికి అనుమతించబోమని, రైళ్లలో జరిమానాల చెల్లింపు ద్వారా టికెట్లు పొందడానికి వీలులేదని దక్షిణ మధ్య రైల్వే పీఆర్వో సీహెచ్ రాకేశ్ స్పష్టంచేశారు. కొవిడ్వ్యాప్తి ఉద్ధృతి నేపథ్యంలో ప్రయాణికుల భద్రత కోసం భారతీయ రైల్వే నూతన మార్గదర్శకాలు జారీచేసినట్టు ఆయన గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రీపెయిడ్ క్యాటరింగ్ సౌకర్యం లేదని, రెడీ టు ఈట్ భోజనం, ప్యాక్ చేసిన ఐటంలు (వాటర్ బాటిళ్లతోసహా) మాత్రమే రైళ్లలో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. రైళ్లలో లెనిన్, దుప్పట్లు, కర్టెన్లు అందజేయరని, ప్రయాణికులు స్వతహాగా తెచ్చుకోవాలని సూచించారు. ప్రయాణ సమయంలో అందరూ కొవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని పేర్కొన్నారు.