మళ్లీ కరోనా కంగారు పెట్టిస్తోంది. ఆరోగ్యం విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోకూడదని ముందస్తుగా పల్స్ ఆక్సో మీటర్, గ్లూకోమీటర్, బ్లడ్ ప్రజర్ మానిటర్ వంటి గాడ్జెట్స్ ని కొంటున్నారు. అయితే ఇవి కొనలేని వారి పరిస్థితి ఏంటి ? ఈ ఆలోచనలోంచే పుట్టింది బ్లడ్ ఆక్సిజన్ సాచ్యురేషన్ మీటర్.. హెల్త్ స్టార్టప్ ఎంఫైన్ ఈ టెక్నాలజీ రూపొందించింది. ఈ సంస్థ తయారుచేసిన ఎంఫైన్ పల్స్ టూల్ ద్వారా మీ బ్లడ్ ఆక్సిజన్ సాచ్యురేషన్ను స్మార్ట్ ఫోన్ తో చెక్ చేసుకోవచ్చు. ఈ యాప్ బీటా వర్షన్ ఆండ్రాయిడ్ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ అయింది. ఐఓఎస్ డివైజ్ లకు త్వరలో రానుంది.
గూగుల్ ప్లేస్టోర్ నుంచి MFine యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ యాప్ ఓపెన్ చేయాలి. అందులో Mpulse పైన క్లిక్ చేయండి. స్మార్ట్ఫోన్ కెమెరా, ఫ్లాష్ ఆన్ చేయాల్సి ఉంటుంది. కెమెరా, ఫ్లాష్ లైట్పైన మీ చేతి వేలిని పెట్టాలి. అప్పుడు స్క్రీన్ రెడ్ కలర్లోకి మారుతుంది. మీ బ్లడ్ వెస్సెల్స్ నుంచి వచ్చే రెడ్, బ్లూ లైట్ ను ఏఐ ఆల్గరిథమ్ గుర్తిస్తుంది. మీ ఆక్సిజన్ సాచ్యురేషన్ లెవెల్ను లెక్కిస్తుంది. 20 సెకన్లలో రిజల్ట్ తెలుస్తుంది. ఆ తర్వాత అనాలిసిస్ రిపోర్ట్ కనిపిస్తుంది.
సాధారణంగా SpO2 లెవెల్ 95 – 100 శాతం ఉండాలి. ఒకవేళ అంతకన్నా తక్కువ ఉంటే ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు, తలనొప్పి, ఛాతీ నొప్పి లాంటి సమస్యలు వస్తాయి. కోవిడ్ 19 తో పాటు ఆస్తమా, సీఓపీడీ, శ్వాసకోశ సంబంధత వ్యాధులు ఉన్నవారు తరచూ SpO2 లెవెల్ చెక్ చేసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.