‘హరిత’ తెలంగాణ దిశగా అడుగులు
ఉట్నూర్ రూరల్, ఏప్రిల్ 29: రాష్ట్రంలో పచ్చదనం పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించింది. అందులో భాగంగా గడిచిన ఆరు విడుతల్లో కోట్లాది మొక్కలు నాటారు. దీని కోసం జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం ద్వారా, ప్రత్యేకంగా అటవీశాఖ, పంచాయతీరాజ్ శాఖల ఆధర్యంలో ఈజీఎస్ ద్వారా నర్సరీలు ఏర్పాటు చేశారు. అదే తరహాలో ఈ సంవత్సరం కూడా సర్సరీల్లో మొక్కలను విరివిగా పెంచుతున్నారు. మొక్కలను భారీ ఎత్తున నాటడానికి అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం దేశానికే ఆదర్శంగా నిల్చింది. వర్షాకాలం ప్రారంభం కాగానే నాటడానికి సిద్ధం చేస్తున్నారు.
ఏపుగా ఎదుగుతున్న మొక్కలు
హరితహరంలో నాటడానికి నర్సరీల్లో మొక్కలు ఏపుగా ఎదుగుతున్నాయి. అధికారులు మూడునెలల నుంచే నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కలు పెంచుతున్నారు. ఇందుకు అటవీశాఖ అధికారులు స్థానిక ఆర్డీవో కార్యాలయ ఆవరణలో కేటీఆర్ ఆధ్వర్యంలో 4 .50 లక్షల మొక్కలను పెంచుతున్నారు. ఇందులో వేప, ఇర్కి, రావి, మర్రి, గుల్మోర్, జువ్వి, ఫిల్సాఫాం, కానుగ, బాంబుతో పాటు చైనా బాదం, అల్లనేరుడు, సీతాఫల్, ఉసిరి, జామ, మల్లె గులాబీ పండ్లు, పూల మొక్కలు పెంచుతున్నారు. ప్రతీ పంచాయతీలో నర్సరీ ఏర్పాటు చేశారు. అందులో పండ్ల రకాలు సీతాఫల్, ఉసిరి, జామ, ద్రాక్ష, నిమ్మ, దానిమ్మ, బాదంతో పాటు ఇంటి ఆవరణలో నాటుకోవడానికి పూల మొక్కలతో పాటు కానుగ, టేకు మొక్కలను విరివిగా పెంచుతున్నారు. 37 పంచాయతీలలో 4 .59 లక్షల మొక్కలు పెంచుతున్నారు. ఖాళీగా ఉన్న స్థలాల్లో, ప్రధాన రహదారికి ఇరువైపులా, పల్లె ప్రకృతి వనాల్లో నాటడానికి కానుగ, వేప, మర్రి, ఇప్ప తదితర మొక్కలు పెంచుతున్నారు. నర్సరీల్లో ప్రతీ విత్తనం మొలకెత్తే విధంగా ప్రతిరోజు అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
‘హరితం’ దిశగా అడుగులు
హరితహారం కార్యక్రమంలో భాగంగా అడవిలో ప్రభుత్వ స్థలాల్లో, రహదారులకు ఇరువైపులా విరివిగా మొక్కలు నాటి హరిత తెలంగాణ దిశగా రాష్ట్రం అడుగులు వేస్తున్నది.
నర్సరీలపై ప్రత్యేక శ్రద్ధ
హరితహారం కోసం నర్సరీలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాం. నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రతి విత్తనం మొలకెత్తే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. నర్సరీల్లో మొక్కలు ఎండిపోకుండా రోజుకు రెండుసార్లు నీరు అందిస్తున్నాం. ఎండ వేడిమి నుంచి తట్టు కోవడానికి గ్రీన్ నెట్ను ఏర్పాటు చేస్తున్నాం.
-రజినీకాంత్, ఏపీవో