హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మహిళలు, పిల్లలపై జరిగే సైబర్ నేరాలను ఛేదించడంలో ప్రతి పోలీస్ స్టేషన్లోని అధికారులకు సైబర్ ఆధారిత నేర పరిశోధనలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని డీజీపీ ఎం మహేందర్రెడ్డి చెప్పారు. ఇందుకోసం ఎంపిక చేసిన 117 మందికి పోలీస్ అకాడమీలో మహిళా భద్రత విభాగం, రాష్ట్ర ఐటీ సెల్ ఆధ్వర్యంలో గురువారం నుంచి శిక్షణ ప్రారంభించారు. మూడురోజులపాటు జరుగనున్న ఈ శిబిరాన్ని డీజీపీ మహేందర్రెడ్డి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజంలో ప్రస్తుతం సైబర్ నేరాలే ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. ఈ నేరాలను సమర్థంగా అరికట్టి, కేసుల దర్యాప్తులో పక్కాగా చర్యలు తీసుకొనేందుకు ప్రతి పోలీస్స్టేషన్లో సిబ్బందిని సైబర్ వారియర్స్గా తీర్చిదిద్దుతున్నట్టు తెలిపారు. సైబర్ నేరాల పరిశోధనలో అత్యంత ముఖ్యమైనది డిజిటల్ ఎవిడెన్స్ అని చెప్పారు. ప్రతి ఒక్కరు డిజిటల్ లైఫ్లో భాగమయ్యారని, సామాన్య నేరాల విషయంలో కూడా సైబర్ క్రైం ఆధారిత నేరాలున్నందున పోలీస్స్టేషన్ స్థాయిలోనే పకడ్బందీగా పరిశోధన జరుగాలన్నదే ఈ శిక్షణ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఫిర్యాదులను క్యూఆర్ కోడ్ ద్వారా నేరుగా పంపించేందుకు విధిగా మొబైల్ ఫోన్లలో ప్రత్యేక క్యూఆర్ కోడ్ను డౌన్లోడ్ చేసుకోవాలని మహిళలకు సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ డీజీపీ స్వాతిలక్రా, డీఐజీ సుమతి పాల్గొన్నారు.