హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): ఈ నెల 25వ తేదీన విడుదల చేయనున్న ఎంసెట్ (ఇంజినీరింగ్) ఫలితాలు, ర్యాంకుల ఖరారులో నార్మలైజేషన్ ప్రక్రియను అమలుచేయనున్నారు. కఠినమైన ప్రశ్నాపత్రం వచ్చిన అభ్యర్థులకు మార్కులు కలపడం, ఈజీ పేపర్ వచ్చినవారి మార్కుల్లో కోత విధించడాన్నే నార్మలైజేషన్ అంటారు. ఈ ఏడాది ఎంసెట్ను ఆరు సెషన్లలో నిర్వహించారు. ఒక సెషన్లో ఈజీ పేపర్, మరో సెషన్లో హార్డ్ పేపర్ వ్యత్యాసాల కారణంగా విద్యార్థులెవరూ నష్టపోకుండా నార్మలైజేషన్ ప్రక్రియను అనుసరించాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) సూచించింది. కఠినమైన, సులభమైన ప్రశ్నాపత్రాలను నిర్ధారించేందుకు నిపుణుల కమిటీని నియమించారు. దీని సూచనల ఆధారంగా జేఎన్టీయూ అధికారులు ఇప్పటికే నార్మలైజేషన్ ప్రక్రియను పూర్తిచేసినట్టు సమాచారం. ఇది అత్యంత గోప్యంగా జరిగే వ్యవహారమని అధికారులు చెప్తున్నారు. ఈ ఏడాది ఇంటర్ మార్కులకు వెయిటేజీ పద్ధతి రద్దు చేసినందున 25న ప్రకటించే ర్యాంకులే తుది ఫలితాలు కానున్నాయి. ఆయా ర్యాంకుల ఆధారంగానే ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలు కల్పిస్తారు.