ఫర్టిలైజర్సిటీ, మే 15: కరోనా విజృంభిస్తున్న వేళ కొవిడ్ పాజిటివ్ ఉన్న గర్భిణికి నార్మల్ డెలివరీ చేసి శభాష్ అనిపించుకొన్నారు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని వైద్యులు. పెద్దపల్లి జిల్లా సుందిళ్లకు చెందిన జనగామ శిరీష (27) గర్భిణి. ఈ నెల 9న ఆమెకు పాజిటివ్ వచ్చింది. ఈ క్రమంలో నొప్పులు రావడంతో ఈ నెల 11న గోదావరిఖని దవాఖానలో చేరింది. శుక్రవారం రాత్రి స్టాఫ్ నర్సులు సమత, ప్రియాంక.. శిరీషకు సాధారణ ప్రసవం చేయగా, 2.7 కిలోల ఆడ శిశువుకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారు. సిబ్బందిని సూపరింటెండెంట్ శ్రీనివాసరెడ్డి అభినందించారు.