హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): తడిసిన, రంగుమారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని, రైతులెవరూ ఆందోళన చెందొద్దని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి భరోసా ఇచ్చారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీచేసినట్టు పేర్కొన్నారు. అకాలవర్షాలతో చాలాచోట్ల ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఆన్లైన్ ద్వారా పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులంతా కొవిడ్ నిబంధనలు పాటించాలని, టోకెన్ల ప్రకారం కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చేలా చూడాలని సూచించారు. చివరి ఆయకట్టు వరకు రైతులకు సాగునీరు అందించేందుకు కృషిచేస్తున్నట్టు చెప్పారు. ఎండాకాలంలో ప్రకృతి వనాల్లోని మొక్కలు ఎండిపోకుండా సర్పంచ్లంతా వాటర్ ట్యాంకర్లతో నీళ్లందించాలని సూచించారు. అచ్చంపేట మున్సిపల్ ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని, టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని తెలిపారు. వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నానని, త్వరలోనే ప్రజల ముందుకు వస్తానని చెప్పారు.