న్యూఢిల్లీ : తౌటే తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో నేడు ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా తుఫాను అనంతర పరిస్థితులపై సమీక్ష నిర్వహించనున్నారు. విలయంతో కలిగిన నష్టాన్ని అంచనా వేయనున్నారు. మొదట గుజరాత్, డీయూను సందర్శించనున్నారు. ఉదయం 9.30 గంటలకు ఢిల్లీ నుంచి భావ్నగర్ చేరుకుంటారు. అక్కడ నుంచి ఉనా, డీయూ, జాఫరాబాద్, మహువా ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. అనంతరం అహ్మదాబాద్ చేరుకొని సమీక్ష జరుపుతారు.
అరేబియా సముద్రంలో ఏర్పడిన తీవ్ర తుఫాను నిన్న రాత్రి గుజరాత్లో 8.30 గంటలకు తీరం దాటిన విషయం తెలిసిందే. ఈ సమయంలో గంటకు 155 నుంచి 190 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో పాటు వర్షం కురవడంతో భారీగా నష్టం జరిగింది. చెట్ల కూలిపోగా, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. భారీగా ఇండ్లు, రోడ్లు దెబ్బతిన్నాయి. తుఫానులో 16వేల ఇండ్లు దెబ్బతిన్నాయని, 40వేలకుపైగా చెట్ల నేలకూయని, వెయ్యి స్తంభాలు విరిగిపోయాయని గుజరాత్ సీఎం విజయ్ రూపానీ చెప్పారు.
తుఫాను ప్రభావంతో సుమారు లక్ష మందికిపైగా తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 1998లో గుజరాత్ను తాకిన తుఫాను సైతం భారీగా నష్టాన్ని కలిగించింది. ఆ తర్వాత భారీ స్థాయిలో తౌటే ప్రభావంతో భారీగా నష్టాన్ని మిగిల్చింది. ప్రస్తుతం తుఫాను బలహీన పడిందని, అయితే భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని, గంటకు 125 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తుందని వాతావరణ శాఖ పేర్కొంది.