కరోనా ప్రభావం రోజు రోజుకు పెరుగుతూ పోతుండడంతో మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త గైడ్లైన్స్ విడుదల చేసింది. సినిమాతో పాటు సీరియల్స్ షూటింగ్స్కు కొద్ది రోజులు బ్రేకులు వేసింది. దీంతో కొన్నాళ్లుగా ముంబైలో షూటింగ్ జరుపుకుంటున్న పాన్ ఇండియా చిత్రాలు ఆదిపురుష్, లైగర్ షూటింగ్స్ ఆగిపోయినట్టు తెలుస్తుంది. కరోనా తీవ్రత తగ్గే వరకు నిర్మాతలు కూడా ఈ సినిమా షూటింగ్ నిర్వహించేందుకు ఆసక్తి చూపడం లేదు. అయితే ఇప్పటికే చిత్ర రిలీజ్ డేట్స్ ప్రకటించిన, సినిమా షూటింగ్స్ ఆగిన నేపథ్యంలో రిలీజ్ డేట్స్ మారతాయేమోననే అనుమానం అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.
బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఆదిపురుష్ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, ఈ చిత్రాన్ని 3డీ వర్షెన్లో భారీగా రూపొందిస్తున్నారు. ఇందులో కృతిసనన్ కథానాయికగా నటిస్తుంది. ప్రభాస్ రాముడిగా కనిపించి అలరించనున్నాడు. ఇక లైగర్ చిత్ర విషయానికి వస్తే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, అనన్య పాండే ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సెప్టెంబర్ 9న చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.