హైదరాబాద్ : గత వారం రోజులుగా హైదరాబాద్లో అక్కడక్కడ చిరు జల్లులు తప్పా సాధారణ వర్షపాతంగానీ, భారీ వర్షం గానీ కురిసిన దాఖలు లేవు. మరోవైపు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. నగరంలో సోమవారం సాధారణ ఉష్ణోగ్రత 30.4 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఐఎండీ హైదరాబాద్ డైరెక్టర్ డాక్టర్ కె.నాగరత్నం తెలిపిన వివరాల ప్రకారం.. రానున్న రెండు, మూడు రోజుల వరకు నగరానికి వర్ష సూచన లేదన్నారు. ఈ వాతావరణ పరిస్థితిని బ్రేక్ మాన్సూన్ అంటామంది. వర్షాలు లేని కారణంగా ఉష్ణోగ్రతలు ఒకటి, రెండు డిగ్రీలు అధికంగా నమోదు కానున్నట్లు చెప్పారు. కాగా ఆగస్టు రెండో వారం నుంచి తెలంగాణ వ్యాప్తంగా వర్షలు కురిసే అవకాశం ఉందన్నారు.
తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ పెరుగుతున్న ఉష్ణోగ్రతల వివరాలను తెలియజేసింది. రాబోయే మూడు రోజుల్లో హైదరాబాద్లో గరిష్ట ఉష్ణోగ్రత 31 నుండి 33 డిగ్రీల సెల్సియస్గా కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల నుండి 23 డిగ్రీల సెల్సియస్గా నమోదు కానున్నట్లు వెల్లడించింది. ఆదిలాబాద్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో మాత్రమే సోమవారం తేలికపాటి జల్లులు కురిశాయి. ఈ జిల్లాల్లో 10 మిల్లీమీటర్ల లోపు మాత్రమే వర్షపాతం నమోదైంది. ఇల్లెందు, భద్రాద్రి కొత్తగూడెంలో అత్యధికంగా 10.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.