ముంబై : మహారాష్ట్రలో ఘోర ఘటన చోటు చేసుకుంది. థానేలోని ఉల్హాస్నగర్లో శుక్రవారం రాత్రి ఓ బిల్డింగ్ పైకప్పు కూలిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదారుగురు వ్యక్తులు శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు భవనం శిథిలాల నుంచి ఏడు మృతదేహాలు వెలికి తీసినట్లు థానే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పేర్కొన్నారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు చెప్పారు.
ఉల్లాస్నగర్లోని నెహ్రూచౌక్ వద్ద ఉన్న ఈ భవనం ఐదో అంతస్థు నుంచి గ్రౌండ్ ఫ్లోర్ వరకు పైకప్పు కూలిపోయింది. రాత్రి 9.30 గంటల సమయంలో ఘటన జరిగిందని అధికారులు పేర్కొన్నారు. మున్సిపల్ కార్పొరేషన్, అగ్నిమాపకశాఖ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అయితే, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, శిథిలాల కింద ఎంత మంది చిక్కుకున్నారో తెలియలేదని అధికారులు తెలిపారు.