హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): సెప్టెంబర్ 17పై విపక్షాలు రాద్ధాంతం చేయటం తగదని, దానిపై ఏ వివాదాలు అక్కర్లేదని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీనేత, పార్టీ సెక్రటరీ జనరల్ కే కేశవరావు అన్నారు. తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా తెలంగాణభవన్లో శుక్రవారం ఆయన జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి, జయశంకర్ విగ్రహాలకు పూలమాల వేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆగస్టు 15, 1947న దేశమంతా స్వాతంత్య్ర సంబురాలు జరుపుకుంటే.. తెలంగాణ (నిజాంస్టేట్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకల్లోని కొన్నిప్రాంతాలు) మాత్రం ఏడాదిపాటు ఆగాల్సి వచ్చిందని వివరించారు. సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజలకు అత్యంత సంతోషకరమైన రోజని చెప్పారు. విలీన దినమా.. విమోచన దినమా.. మరొక అనే వాదాలు అవసరం లేదని తెలిపారు. అది తెలంగాణ ప్రాంతానికి విలీన దినమేనని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా జునాగఢ్, కశ్మీర్, నిజాంస్టేట్ వంటి సంస్థానాలు ఒక్కొక్కటిగా దేశంలో విలీనమయ్యాయని, అందు లో తెలంగాణకు ప్రత్యేక పాత్ర పోషించిందని వివరించారు.
వివాదాలు కాదు వికాసం చూడాలి: బోడకుంటి వెంకటేశ్వర్లు
తెలంగాణలో అన్నిరంగాల్లో అద్భుతమైన అభివృద్ధి సాగుతుంటే విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోడకుంటి వెంకటేశ్వర్లు తెలిపారు. సీఎం కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని, జరుగుతున్న అభివృద్ధిని గమనించకుండా విలీనదినంపై విపక్షా లు రాద్ధాంతాలు చేయటం సరికాదని పేర్కొన్నారు. విపక్షాలు చేసే అసత్య ప్రచారాలను టీఆర్ఎస్ శ్రేణులు ఎక్కడిక్కడ తిప్పికొట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ గంగాధర్గౌడ్, పార్టీ ప్రధానకార్యదర్శులు ఎం శ్రీనివాస్రెడ్డి, సోమ భరత్కుమార్, నాయినేని రాజేశ్వర్రావు, ఓయూ విద్యార్థి నాయకులు కడారి స్వామి యాదవ్, రఘు రాం తదితరులు పాల్గొన్నారు.