శ్రీశైలం వద్ద విద్యుదుత్పత్తిచేసే అంశంలో కృష్ణాబోర్డును ఏపీ సర్కారు తప్పుదోవ పట్టిస్తున్నది. 1990-91 నుంచి 2019-2020 సంవత్సరాల కాలంలో ఏనాడూ ఏప్రిల్, మే నెలల్లో శ్రీశైలం ప్రాజెక్టులో 834 అడుగులకు పైనా నీళ్లు ఉండేలా చూడలేదు. ఇప్పుడు మాత్రం 854 అడుగులకు పైన నీటి మట్టం ఉండాలని కోరుతున్నది. అందుకు ఏపీ ఆంతర్యం వేరు.గోదావరి నది నుంచి నీటిని కృష్ణా డెల్టాకు తరలిస్తున్నది. నాగార్జునసాగర్ నీరు ఏపీకి అవసరం లేకుండా పోయాయి. దీంతో ఆ నీళ్లను పెన్నా బేసిన్కు తరలించాలని ఏపీ భావిస్తున్నది. అది సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం.
హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): కృష్ణా జలాల్లో తమకు కేటాయించిన నీళ్లవాటానే వినియోగించుకొంటున్నామని తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదీ జలాల యాజమాన్య బోర్డుకు లేఖ రాసింది. తనకు ఉన్న హక్కు మేరకు.. గతంలో జారీచేసిన జీవోల ప్రకారం విద్యుదుత్పత్తి చేస్తున్నామని తేల్చిచెప్పింది. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అభ్యంతరాలు ఉండాల్సిన అవసరం లేదని స్పష్టంచేసింది. ప్రణాళికాసంఘం నివేదిక, కృష్ణా మొదటి ట్రిబ్యునల్ తీర్పునకు లోబడే సాగర్లో క్యారీ ఓవర్ స్టోరేజీ ఉండేలా తెలంగాణ కరెంటు ఉత్పత్తి చేస్తున్నదని పేర్కొన్నది. 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం 50ః50 దమాషా ప్రకారం విద్యుత్తు పంపకాలు చేయాలన్న ఒప్పందం ఆ ఒక్క సంవత్సరానికే చెల్లుబాటు అవుతుందని స్పష్టంచేసింది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదలశాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ సీ మురళీధర్ కేఆర్ఎంబీకి ఆదివారం లేఖ రాశారు. నిబంధనలకు విరుద్ధంగా కేటాయింపులకు మించి కృష్ణా జలాలను వాడుకోవడంతోపాటు, సహజన్యాయ సూత్రాలకు విరుద్ధంగా జలాలను బేసిన్ అవతలి ప్రాంతాలకు ఏపీ సర్కారు తరలిస్తున్నదని, ఈ వాస్తవాలను దాచిపెట్టి బోర్డును ఏపీ సర్కారు తప్పుదారి పట్టిస్తున్నదని పేర్కొన్నారు. విద్యుదుత్పత్తి వల్ల తమకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నదని ఏపీ సర్కారు కేఆర్ఎంబీకి ఫిర్యాదుచేసిన నేపథ్యంలో విద్యుదుత్పత్తిని ఆపాలంటూ బోర్డు తెలంగాణకు లేఖ రాసిన నేపథ్యంతో ఈఎన్సీ స్పందించారు. తెలంగాణపై ఏపీ చేసిన వాదనలను నిర్దంద్వంగా కొట్టిపారేశారు. విద్యుదుత్పత్తి వల్ల తనకు నష్టం వాటిల్లుతుందనే ఆరోపణలు నిరాధారమని స్పష్టంచేశారు. వాస్తవాలను గ్రహించి ఆ తరువాత ఒక నిర్ణయానికి రావాలని కేఆర్ఎంబీకి హితవు పలికారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్వాపరాలు.. ఏపీ సర్కారు వ్యవహరిస్తున్న తీరును ఎండగడుతూ వివిధ అంశాలను సవివరంగా లేఖలో పొందుపరిచారు. లేఖలోని ముఖ్యాంశాలు.
1959లో శ్రీశైలం వద్ద జలవిద్యుత్తు ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతి లభించింది. 1963లో ప్రణాళికాసంఘం దీనిని ఆమోదించింది. కేంద్రం అనుమతుల ప్రకారం ప్రాజెక్టు నుం చి నీటిని జల విద్యుత్తుకు తప్ప మిగతా అవసరాలకు మళ్లించడానికి ఎంతమాత్రం వీలులేదు. ‘శ్రీశైలం ప్రాజెక్టు జలవిద్యుత్తు ప్రాజెక్టు కాబట్టి నీటిని జలవిద్యుదుత్పత్తికి తప్ప మరో వాటర్షెడ్ లేదా ఏ ప్రయోజనంకోసం వినియోగించడానికి వీలులేదు. ఆవిరి వల్ల కలిగే నష్టాలు ఇందుకు మినహాయిం పు. (కృష్ణావాటర్ ట్రిబ్యునల్ -1 పేజీ 104) . శ్రీశైలం ప్రాజెక్టులో 760 అడుగుల వరకు ఉన్నా నీటిని విడుదల చేయవచ్చని 2013లో అప్పటి ఏపీ ప్రభుత్వం జీవోను జారీ చేసింది
ఇప్పటికే కృష్ణా మిగుల జలాలపై ఎలాంటి ప్రాజెక్టులు నిర్మించవద్దని ట్రిబ్యునల్స్ స్పష్టం చేసినా ఏపీ అందుకు విరుద్ధంగా గాలేరు-నగరి, వెలిగొండ, హంద్రి నీవా తదితర ప్రాజెక్టులను, అది కూడా కృష్ణా బేసిన్కు అవతల పెన్నా బేసిన్లో నిర్మించింది. ఆ ప్రాజెక్టుల మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 350 టీఎంసీలు ఉంటుంది. జూన్ 10 నాటికి ఏపీలోని పెన్నా బేసిన్ జలాశయాల్లో 95 టీఎంసీల నీరు ఉన్నది. మొత్తంగా కేటాయింపులకు మించి గత రెండేండ్లుగా, ఏపీ ఏకంగా 170, 124 టీఎంసీలను మించి తరలించింది. అందులో చైన్నై తాగునీటి కోసం కనీసం 10 టీఎంసీలు కూడా సరఫరా చేయలేదు. దీనివల్ల ఎక్కువగా నష్టపోతున్నది తెలంగాణ ప్రాంతమే. ఈ వాస్తవాలను దాచిపెట్టి ఏపీ సర్కారు అందరినీ తప్పుదోవ పట్టిస్తున్నది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని, సరైన అభిప్రాయానికి రావాలని కేఆర్ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం సూచించింది.