హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మిషన్ భగీరథ పథకానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఉన్న నీతి ఆయోగ్ ప్రసంశల జల్లు కురిపించింది. మిషన్ భగీరథ అద్భుతమైన పథకం అని నీతి ఆయోగ్ కితాబు ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ ట్విట్టర్ వేదికగా వెల్లడిస్తూ ప్రశంసలు కురిపించారు.
మిషన్ భగీరథ ద్వారా వంద శాతం ఇండ్లకు తాగు నీరు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 54 లక్షల 6 వేల 70 ఇండ్లకు మిషన్ భగీరథ ద్వారా నల్లాలతో తెలంగాణ రాష్ట్రం తాగునీటిని అందిస్తోంది. ఇది వంద శాతం. హర్యానా రాష్ట్రంలో 30 లక్షల 96 వేల 792 ఇండ్లకు, గోవా రాష్ట్రంలో 2 లక్షల 63 వేల 13 ఇండ్లకు, పుదుచ్చేరిలో 1 లక్ష 14 వేల 908 ఇండ్లకు తాగు నీటిని అందిస్తూ వంద శాతం లక్ష్యాన్ని చేరుకున్నాయని కేంద్ర నీతి ఆయోగ్ పేర్కొంది.
కేంద్ర నీతి ఆయోగ్ రాష్ట్ర మిషన్ భగీరథ పథకానికి కితాబును ఇవ్వడం పట్ల రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ప్రతి ఇంటికి నల్లాల ద్వారా స్వచ్ఛమైన తాగునీటిని అందించాలన్న సీఎం కేసీఆర్ అకుంఠిత దీక్షకు ఈ పథకం నిదర్శనం అని వినోద్ కుమార్ అన్నారు. ఈ మేరకు వినోద్ కుమార్ కేంద్ర నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్కు రీ ట్వీట్ చేశారు.