హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు హరిత ఉద్యమాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్నారని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్కాంత్ ప్రశంసించారు. సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారం ఎలా ఫలవంతమైందో తనకు తెలుసునని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం కేసీఆర్ అద్భుతమైన అడుగులు వేశారని మెచ్చుకున్నారు. ఈ స్ఫూర్తిని ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ ప్రేమికులు హర్షించడమే కాదు, అభినందిస్తున్నారని పేర్కొన్నారు. వాతావరణ సమతుల్యత కోసం తెలంగాణ వేసిన అడుగు ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా చాలెంజ్ను స్వీకరించిన అమితాబ్కాంత్.. ఆదివారం న్యూఢిల్లీ మోతీబాగ్లోని తన నివాస ప్రాంగణంలో మూడు మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా అమితాబ్కాంత్కు సంతోష్కుమార్ వృక్షవేదం పుస్తకాన్ని బహూకరించారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారం కార్యక్రమం గురించి వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్ఫూర్తితోనే తాను గ్రీన్ ఇండియా చాలెంజ్ను చేపట్టినట్టు చెప్పారు. ఎంపీ సంతోష్కుమార్ను అమితాబ్కాంత్ అభినందించారు. ప్రతి ఒక్కరు ఒక మొక్కనాటి .. మరో ముగ్గురు నాటేలా సవాల్ విసిరటం అనే కాన్సెప్ట్ అద్భుతంగా ఉన్నదని కొనియాడారు. అందువల్లే ఇది నిరంతరాయంగా కొనసాగుతున్నదని పేర్కొన్నారు. ఇకనుంచి తానెక్కడికి వెళ్లినా ఈ స్ఫూర్తిని ప్రచారం చేస్తానని అమితాబ్కాంత్ ప్రకటించారు. ఇలాగే ముందుకుసాగితే తప్పకుండా పర్యావరణ మార్పులపై విజయం సాధించగలమని ధీమా వ్యక్తంచేశారు. పర్యావరణ సమతుల్యత దెబ్బతింటే మానవ మనుగడకే ముప్పు ఉంటుందని, దీన్ని అధిగమించటానికి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. అమితాబ్కాంత్ను కలిసినవారిలో పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేతకాని కూడా ఉన్నారు.