హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): సెంట్రల్ సీట్ అలకేషన్ బోర్డు (సీ శాబ్) చైర్మన్గా ప్రొఫెసర్ కరణం ఉమామహేశ్వర్రావు నియమితులయ్యారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) రూర్కేలా (ఒడిశా) డైరెక్టర్గా కొనసాగుతున్న ఆయనను సీ శాబ్ చైర్మన్గా నియమిస్తూ కేంద్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఇటీవల జరిగిన కౌన్సిల్ ఆఫ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (ఎన్ఐటీఎస్ఈఆర్) 4వ కౌన్సిల్ సమావేశంలో ఆయనను చైర్మన్గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
2023 సంవత్సరానికిగాను ఆయన నేతృత్వంలోని కమిటీ ఎన్ఐటీల్లో సీట్ల భర్తీని చేపడుతుంది. కరణం ఉమామహేశ్వర్రావు హైదరాబాద్ వాసి. ఉస్మానియా పూర్వ విద్యార్థి. 1983 ప్రాంతంలో ఓయూ ఇంజినీరింగ్ కాలేజీ నుంచి మైనింగ్ ఇంజినీరింగ్లో బీటెక్ చదివారు. ఎంటెక్, పీహెచ్డీ పూర్తిచేసిన ఆయన తొలుత కర్ణాటకలోని సురత్కల్ రీజినల్ ఇంజినీరింగ్ కాలేజీలో లెక్చరర్గా, ఐఐటీ ఖరగ్పూర్లో ప్రొఫెసర్గా సేవలందించి, ఎన్ఐటీ సురత్కల్ డైరెక్టర్గా పనిచేశారు.