ఎస్వోటూ జీఎం సాంబయ్య
ఓసీపీ-3లో టీకాల పంపిణీ ప్రారంభం
యైటింక్లయిన్ కాలనీ, ఏప్రిల్ 28: సింగరేణిలోని ప్రతి ఉద్యోగికి కొవిడ్ వ్యాక్సిన్ అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఎస్వోటూ జీఎం సందనాల సాంబయ్య తెలిపారు. గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ విన్నపం మేరకు సంస్థ సీఎండీ ఎన్ శ్రీధర్ ఆదేశాలతో కార్మికుల వద్దకే టీకా అనే పద్ధతిలో గనులు, డిపార్టుమెంట్లపై వ్యాక్సిన్ ఇస్తున్నామని వివరించారు. అందులో భాగంగా బుధవారం ఓసీపీ-3 సీహెచ్పీలో కార్మికులకు వ్యాక్సిన్ టీకాను ప్రారంభించి మాట్లాడారు. ఉద్యోగులు కరోనా బారిన పడకుండా పని స్థలాల్లో హైపోక్లోరైట్ పిచికారీ చేయిస్తున్నామని, శానిటైజర్ అందుబాటులో ఉంచుతున్నామని వివరించారు. పని స్థలాల్లో భౌతి క దూరం పాటించేలా ఆదేశిస్తూ రక్షణతో కూడిన ఉత్పత్తి వెలికి తీస్తున్నామని తెలిపారు. ఉద్యోగులు ఆందోళన పడకుండా ఏ చిన్న ఇబ్బంది వచ్చినా డిస్పెన్సరీలో పరీక్షలు చేయించుకుని చికిత్స పొందాలని కోరారు. కార్యక్రమంలో టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షులు ఐలి శ్రీనివాస్, సీఎంవోఎఐ సభ్యుడు పైడీశ్వర్, పీవో మోహన్ రెడ్డి, డాక్టర్ రమేశ్బాబు, సీహెచ్పీ ఎస్ఈ సదానందం,సీనియర్ పీవో వంశీధర్, ఎస్ఎస్వో పీవీ రమణ, పిట్ కార్యదర్శి ఆవుల లచ్చయ్య జీఎం సభ్యుడు సత్యం, పారామెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.