సిటీబ్యూరో, మే 23 (నమస్తే తెలంగాణ): కరోనా కష్ట కాలంలో సైబర్నేరగాళ్లు కొలువుల పేరుతో అమాయకులను నిండా ముంచేస్తున్నారు. కొవిడ్ నేపథ్యంలో ఉద్యోగాల కోసం అనేక మంది ఆన్లైన్లోనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆన్లైన్లోనే ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. దీన్ని ఆసరాగా చేసుకున్న సైబర్ నేరగాళ్లు ఆయా సంస్థలకు సంబంధించిన నకిలీ ఈ మెయిల్ ఐడీలు, నకిలీ లెటర్ ప్యాడ్లు తయారు చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి పంపిస్తున్నారు. ఇది నిజమని నమ్మిన బాధితులు సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుతున్నారు. అడిగిన కాడికి డబ్బులు చెల్లిస్తూ.. నిండా మునుగుతున్నారు. ఢిల్లీ, గురుగావ్ ప్రాంతాలకు చెందిన సైబర్ నేరగాళ్లే ఎక్కువగా ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారు. ఢిల్లీలో లాక్డౌన్ ఉండటంతో అక్కడ కాల్సెంటర్లు మూతపడ్డాయి. దీంతో కాల్సెంటర్లలో పనిచేసే వారు వర్క్ఫ్రమ్ హోం చేస్తూ.. నిరుద్యోగులకు వల వేస్తున్నట్లు సైబర్క్రైమ్ పోలీసులు పేర్కొన్నారు.
విదేశాల్లో ఉద్యోగం.. వీసా మేమే ఇప్పిస్తాం.. అంతా మేమే చూసుకుంటాం అనగానే.. నిరుద్యోగులు ఎగిరి గంతేస్తున్నారు. బ్యాక్ డోర్ నుంచి ఉద్యోగం ఇప్పిస్తారనే ఆశతో నిరుద్యోగులు వెనుకా.. ముందు ఆలోచించకుండా.. అడిగిన కాడికి డిపాజిట్ చేస్తున్నారు. అయితే రిజిస్ట్రేషన్ ఫీజుతో మొదలవుతున్న ఈ మోసం ఎక్కడ ముగుస్తదో తెలియని పరిస్థితి. ఉద్యోగం కావాలంటే ఇవన్నీ తప్పనిసరిగా చెల్లించాలని, అందులో కొన్ని డిపాజిట్లే ఉంటాయంటూ నమ్మిస్తూ సైబర్నేరగాళ్లు నిండా ముంచేస్తున్నారు.
గత నెలలో ఓ యువకుడికి ఫేస్బుక్లో పరిచయమైన సైబర్నేరగాళ్లు కెనడాలో ఉద్యోగం ఇప్పిస్తామంటూ రూ. 14 లక్షలు కాజేశారు.
నెల రోజుల కిందట మంగళహాట్కు చెందిన ఇద్దరు అక్కాచెల్లెండ్లకు ‘ఇస్తారా ఎయిర్లైన్స్’లో ఉద్యోగం ఇస్తామంటూ నమ్మించిన సైబర్ నేరగాళ్లు వారి నుంచి రూ.40 లక్షలు దోచేశారు.
బ్యాక్డోర్ ఉద్యోగం కోసం ప్రయత్నించే వారే సైబర్నేరగాళ్ల వలలో చిక్కుతున్నారు. రిజిస్ట్రేషన్ ఫీజు తక్కువ మొత్తంలో ఉండటంతో ఈజీగా చెల్లిస్తున్నారు. ఆ తరువాత ఉద్యోగం వచ్చినట్టే సైబర్నేరగాళ్లు నమ్మించడంతో బాధితులు బోల్తా పడుతున్నారు. ఉద్యోగం కోసం డబ్బులు డిపాజిట్ చేయాలని చెబితే.. అది మోసమని గ్రహించాలని సైబర్క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు.