నిజామాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నిజాంసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. సమైక్య పాలనలో ఏనాడు ఆదరణకు నోచుకోని ఈ ప్రాజెక్టు స్వరాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జలకళ సంతరించుకున్నది. ఆయకట్టు రైతులే ఆశ్చర్యపోయేలా వేసవిలో గోదావరి జలాలు పరుగులు తీసి నిజాంసాగర్కు చేరుకోవడం ఓ చరిత్ర. హల్దీ వాగు మీదుగా కొండపోచమ్మ సాగర్ నుంచి తరలివచ్చిన నీళ్లతో నిజాంసాగర్ప్రాజెక్టు పులకరించింది. రెండున్నర లక్షల ఎకరాల ఆయకట్టు రైతుల బతుకులు మార్చేందుకు సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో మొన్నటి యాసంగి పంటల సీజన్ గొప్పగా ముగిసింది. ఏడాది పొడవునా నిజాంసాగర్ ప్రాజెక్టు జలకళతో ఉట్టిపడింది. రెండు దశాబ్దాల్లో కనీవినీ ఊహించని పరిణామంగా ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. తాజాగా భారీ వరదల కారణంగా నిజాంసాగర్ కళకళలాడుతున్నది. భారీ వానలు, సీఎం కేసీఆర్ ఆలోచనలో భాగంగా మళ్లించిన గోదావరి జలాల ఫలితంగా బోసిపోయిన నిజాంసాగర్కు పూర్వ వైభవం సంతరించుకోవడంతో అన్నదాతలు సంబురపడుతున్నారు.