సిటీబ్యూరో, మే 23 (నమస్తే తెలంగాణ): రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తామని, డబ్బులు వసూలు చేసేవారిని నమ్మి మోసపోవద్దని దక్షిణ మధ్య రైల్వే ఆదివారం ప్రకటన జారీ చేసింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు లేదా రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ద్వారా మాత్రమే ఉద్యోగాలు భర్తీ అవుతాయని వివరించింది. వీటి ద్వారా కాకుండా ఏ విధంగా కూడా అంటే అడ్డదారుల్లో ఎవరికి కూడా రైల్వే ఉద్యోగాలు రావన్నారు. గుంతకల్ రైల్వే డివిజన్ పరిధిలో దాదాపు 12 మంది అభ్యర్థులు రైల్వేలో సీనియర్ క్లర్క్ ఉద్యోగాలకు ఎంపికైనట్లుగా కొందరు నకిలీ పోస్టింగ్ ఆర్డర్లు సృష్టించి, వాటిని అభ్యర్థులకు అందచేసినట్లు ఎస్సీఆర్ తెలిపింది. ఈ విషయం తమ దృష్టికి రావడంతో నిందితులపై చర్యలు తీసుకుంటున్నామని వివరించింది.