హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టుపై పిటిషనర్ సవాలు చేయటం లేదని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) స్పష్టంచేసింది. పర్యావరణ ఉల్లంఘనలపై మాత్రమే పిటిషన్ దాఖలైనట్టు వెల్లడించింది. ఉదండాపూర్ రిజర్వాయర్కు 16 కిలోమీటర్ల అడ్డుకట్ట నిర్మాణానికి భారీగా చెరువులను తవ్వుతున్నారని ఏపీలోని ముదిరెడ్డిపల్లికి చెందిన కోస్టి వెంకటయ్య ఎన్జీటీలో పిటిషన్ దాఖలుచేశారు. దీనిపై శుక్రవారం విచారణ జరగ్గా తెలంగాణ ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ రాంచందర్రావు వాదనలు వినిపించారు. పిటిషన్కు విచారణ అర్హత లేదని, 2016లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను తాగునీటి ప్రాజెక్టుగా ప్రభుత్వం చేపట్టగా ఇప్పుడు పిటిషన్ వేయడమేంటని, అది నిర్దేశిత సమయానికి విరుద్ధమని తెలపగా.. కేవలం పర్యావరణ ఉల్లంఘనపైనే పిటిషన్ దాఖలైనట్టు జస్టిస్ రామకృష్ణన్, ఎక్స్పర్ట్ మెంబర్ సత్యగోపాల్ బెంచ్ తెలిపింది. ఈ కేసులో కేంద్ర పర్యావరణశాఖ, తెలంగాణ సాగునీటిశాఖ తదితరుల కు నోటీసులు జారీచేసింది. పర్యావరణ ఉల్లంఘనలు జరిగాయో లేదో తేల్చేందుకు కేంద్ర పర్యావరణశాఖ ప్రాంతీయ కార్యాలయ సీనియర్ అధికారి, కేంద్ర కాలుష్య నియంత్రణమండలి చెన్నై ప్రాంతీయ కార్యాలయ శాస్త్రవేత్త, మహబూబ్నగర్ కలెక్టర్, నీరి సంస్థ ప్రతినిధి, గనులు, జియాలజీశాఖ డైరెక్టర్లతో కమిటీని నియమించింది. తనిఖీచేసి ఆగస్టు 27లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.