పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తాం
సీపీ సత్యనారాయణ
వ్యాపారులకు అవగాహన
బాల్క ఫౌండేషన్ ద్వారా పారిశుధ్య కార్మికులకు నిత్యావసర సరుకుల పంపిణీ
చెన్నూర్, జూన్ 7 : నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యాపారులను రామగుండం సీపీ వీ సత్యనారాయణ హెచ్చరించారు. చెన్నూర్లోని సంతోషిమాత ఫంక్షన్ హాల్లో సోమవారం చెన్నూర్, కోటపల్లి, వేమనపల్లి మండలాల్లోని ఎరువులు, విత్తనాల వ్యాపారులకు నకిలీ విత్తనాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడు తూ.. నకిలీ విత్తనాలు విక్రయించే వ్యాపారులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని, వారిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నకిలీ విత్తనాల విక్రయాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని, నిత్యం విస్తృతంగా తనిఖీలు చేస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక రాష్ర్టాల నుంచి నకిలీ విత్తనాలు వస్తున్నట్లు తమకు సమాచారం ఉన్నదన్నారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అనుమతి ఉన్న విత్తనాలు, పురుగు మందులను విక్రయించాలని వ్యాపారులకు సూచించారు. వాటికి తప్పకుండా రసీదు ఇవ్వాలని సూచించారు. నకిలీ విత్తనాలు విక్రయించినా, కొనుగోలు చేసినా, ఎవరైనా వ్యాపారులు రసీదులు ఇవ్వకపోయినా వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో ఏసీపీ నరేందర్, వ్యవసాయ శాఖ ఏడీఏ జాడి బాపు, చెన్నూర్, చెన్నూర్ రూరల్ సీఐలు ప్రవీణ్ కుమార్, నాగరాజు, చెన్నూర్, వేమనపల్లి మండలాల ఏవోలు మహేందర్, విజయ్ కుమార్, చెన్నూర్, కోటపల్లి ఎస్ఐలు వినోద్, విక్టర్, రవి, చెన్నూర్, కోటపల్లి, వేమనపల్లి మండలాల వ్యవసాయ శాఖ సిబ్బంది, ఎరువులు, విత్తనాల వ్యాపారులు పాల్గొన్నారు.
నిత్యావసర సరుకుల పంపిణీ..
చెన్నూర్, జూన్ 7: బాల్క ఫౌండేషన్ ద్వారా చెన్నూర్ మున్సిపాలిటీ పారిశుధ్య కార్మికులకు సీపీ సత్యనారాయణ నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తండ్రి బాల్క సురేశ్ ఇటీవల మృతి చెందగా, అతని జ్ఞాపకార్థం బాల్క ఫౌండేషన్ సభ్యుడు భద్రయ్య నిత్యావసర సరుకులను సమకూర్చారు. 25 కిలోల బియ్యం, శానిటైజర్, మాస్క్ చొప్పున 89 మంది కార్మికులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్ పర్సన్ అర్చనా గిల్డా, మున్సిపాలిటీ కమిషనర్ ఖాజా మోయిజొద్దీన్ తదితరులు పాల్గొన్నారు.