హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఈసారి భూముల వేలం రొటీన్కు భిన్నంగా జరుగనున్నది. త్వరలో నిర్వహించే ఈ వేలంలో ప్రభుత్వం కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టనున్నది. భూముల గుర్తింపు నుంచి వేలం వరకు ప్రతి స్థాయిలో పూర్తి పారదర్శకంగా ఉండేలా ప్రభుత్వం అన్ని కోణాల్లో ఆలోచించి నిబంధనలు రూపొందించింది. సాధారణంగా ప్రైవేటు వెంచర్లు, వ్యక్తుల నుంచి స్థలం లేదా ప్లాట్ కొనుగోలు చేయాలంటే ఒకటికి రెండుసార్లు పరిశీలించాల్సి ఉంటుంది. అయినా కొనుగోలు చేసిన తర్వాత వివాదాలు తలెత్తిన సందర్భాలెన్నో. ప్రభుత్వం వేలం ద్వారా అమ్మే భూముల విషయంలో ఇలాంటి వివాదాలు తలెత్తే అవకాశమే ఉండదు. భవిష్యత్తులోనూ ఆ భూములు భద్రంగా ఉంటాయి. దీంతో ప్రభుత్వం నిర్వహించే వేలంలో భూములు కొనేందుకు చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈసారి జిల్లాల్లోని భూములను గంపగుత్తగా కాకుండా.. లే-అవుట్లుగా మార్చి విక్రయించనున్నది. వీటి ధరలను నోడల్ ఏజెన్సీ ద్వారా నిర్ణయించడం వల్ల మార్కెట్ ధరకు ఏమాత్రం తగ్గకుండా ప్రభుత్వానికి ఆదాయం రానున్నది. దీనికితోడు భూములు కొన్న తర్వాత యజమానులు ఇంటి నిర్మాణం కోసం కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండా అన్ని రకాల అనుమతులను ముందుగానే ఇవ్వనున్నది. ఇది వినూత్నమైన ఆలోచన అని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి.
రియల్ రంగానికి మహర్దశ
ప్రభుత్వ వెంచర్కు సమీపంలో ఉన్న భూముల విలువ కూడా పెరుగుతుందని గత అనుభవాలు స్పష్టం చేస్తున్నాయి. గతంలో హైదరాబాద్లో భూములు వేలం వేసిన చోట కొనుగోలుదారులు పోటీపడ్డారు. చాలా మంది మార్కెట్ రేటు కన్నా ఎక్కువ ధరకు స్థలాలు కొనుగోలు చేశారు. దీంతో సమీపంలోని భూముల ధరలకు సైతం ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. త్వరలో నిర్వహించనున్న భూముల వేలంతో కూడా ఇదే జరుగుతుందని, ప్రభుత్వ వెంచర్లకు సమీపంలోని భూముల ధరలు కూడా అనూహ్యంగా పెరుగుతాయని నిపుణులు చెప్తున్నారు. దీంతో రియల్ ఎస్టేట్ రంగానికి మరింత ఊపు వస్తుందంటున్నారు. ప్రభుత్వ భూములపై ఎప్పుడూ కబ్జాకోరుల కన్ను ఉంటుంది. చిన్న అవకాశం దొరికినా అన్యాక్రాంతం చేస్తుంటారు. ఇప్పటికే ఇలా వేల ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి. ఈ నేపథ్యంలో దశాబ్దాల నుంచి నిరుపయోగంగా ఉన్న భూములను ప్రభుత్వమే వేలం వేసి ఆదాయాన్ని సమకూర్చుకోనున్నది.