హైదరాబాద్/సిటీబ్యూరో, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): రెండోదశలో కరోనా రూపుమార్చుకుంటున్నది. ఒకవైపు వైరస్ పరివర్తన జరుగుతుండగా, మరోవైపు వ్యాధి లక్షణాలు రోజురోజుకు మారుతున్నాయి. ప్రస్తుతం వైరస్ బారిన పడుతున్నవారిలో 90 శాతం మందికి పాత లక్షణాలు కనిపించడంలేదు. గతంలో జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ఒంటి నొప్పులు, రుచి కోల్పోవడం, వాసన గుర్తించకపోవడం వంటి లక్షణాలు మాత్రమే ఉండగా, ఈ సారి కొత్త లక్షణాలు వస్తుండటాన్ని వైద్యులు గుర్తిస్తున్నారు. ఇదే విషయాన్ని పలు అధ్యయనాలు కూడా స్పష్టంచేస్తున్నాయి. దీని ప్రకారం నోటి అల్సర్లు, పెదవులు పగలడం, నాలుక రంగు మారడం, నోటి పూత, కండ్లు ఎర్ర బడటం, నిరంతరంగా దగ్గు రావడం, శ్వాస తక్కువగా తీసుకోవడం, కడుపు నొప్పి, గుండెలో మంట, న్యూరాలజీ సమస్యలు, మానసిక ఒత్తిడి, నిద్ర లేకపోవడం వంటి కొత్త తరహా ఆరోగ్య సమస్యలు ఉంటున్నాయి. లక్షణం ఏదైనప్పటికీ కరోనా అని అనుమానపడాల్సిన పరిస్థితులు వచ్చాయని వైద్యనిపుణులు చెప్తున్నారు. ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించినా వెంటనే కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోవడం మంచిదని సూచిస్తున్నారు. దీని వల్ల త్వరగా చికిత్స మొదలు పెట్టడంతోపాటు వైరస్ వ్యాప్తిని అరికట్టడం సాధ్యమవుతుందని స్పష్టంచేస్తున్నారు. మహమ్మారి సోకినవారిలో కొత్త తరహా లక్షణాలు 50- 70 శాతం మందిలో కనిపిస్తున్నాయని, తమకు పెద్దగా లక్షణాలు లేవని నిర్లక్ష్యంచేయడం వల్ల మరొకరికి వైరస్ అంటించినవారవుతారని, ఆదమరిస్తే వైరస్ ఆగంచేస్తదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
కరోనా మొదటిదశలో ఇంట్లో భర్తకు సోకితే భార్యకు సోకలేదు. ఒకరిద్దరికే పరిమితమైంది. కానీ ప్రస్తుత రెండోదశ పూర్తి భిన్నంగా కనిపిస్తున్నది. పిల్లలతో సహా ఇంటిల్లాదిని వైరస్ చుట్టుముడుతున్నది. దీనికి ప్రధాన కారణం మహమ్మారి అంటుకునేవరకు తెలియకపోవడమే అంటున్నారు వైద్యనిపుణులు. రూపం మార్చుకున్న ఈ వైరస్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్నదని చెప్తున్నారు. రెండోదశ కొత్త లక్షణాలు బయటపడుతుండగా, ఇది తెలియని చాలామంది ఇతరులకు వ్యాపింపజేస్తున్నారు. ప్రస్తుతం వ్యాపిస్తున్న వైరస్ 90శాతం మందిలో మొదటిదశ లక్షణాలు ఏమాత్రం కనిపించడంలేదని వైద్యులు చెప్తున్నారు. రోగనిరోధకశక్తి తక్కువగా ఉండి బలహీనంగా ఉన్నవారు అనారోగ్యానికి గురవడంతో విషయం బయటపడుతున్నది. కానీ ఎవరి వల్ల వ్యాప్తిచెందిందనేది తెలియడంలేదు. లక్షణాలు బయటపడని వ్యక్తి అగ్గి రాజేసినట్టు ఇతరులకు అంటిస్తూ వెళ్తున్నారు.
వైరస్ సోకిన చాలామందిలో లక్షణాలు కనిపించడంలేదు. అసింప్టమాటిక్ కేసుల వల్ల వారికి ఇబ్బంది లేకపోయినా ఇతరులకు ప్రమాదకరం. దీనిని దృష్టిలో పెట్టుకొని మాస్క్ లేకుండా ఎట్టిపరిస్థితుల్లో బయటకు వెళ్లకూడదు. భౌతికదూరం పాటించాలి. రద్దీ ప్రదేశాలకు వెళ్లకూడదు. దూర ప్రయాణాలు చేయవద్దు. బయటి నుంచి వచ్చిన వెంటనే స్నానం చేసి ఇంట్లోకి వెళ్లడం మంచిది. ఏదైనా వస్తువును తాకితే చేతులను శానిటైజర్తో రుద్దుకోవాలి.
డాక్టర్ బీ నాగేందర్, సూపరింటెండెంట్, ఉస్మానియా దవాఖాన