Cyber crime | పార్ట్టైమ్ జాబ్ పేరుతో వల వేసి.. ఆ తరువాత ఇన్వెస్ట్మెంట్లోకి మార్చేస్తున్న సైబర్ నేరగాళ్లు నయా పంథాలో బ్యాంకు ఖాతాలను సమకూర్చుకుంటున్నారు. ఇప్పటి వరకు మధ్యవర్తులు, కమిషన్ ఏజెంట్ల ద్వారా బ్యాంకు ఖాతాలను సేకరించిన సైబర్నేరగాళ్లు ఇప్పుడు బాధితుల నుంచే ఖాతాలు తెరిపిస్తున్నారు. తాము మోసపోయామని, తమ డబ్బు తమకు వాపస్ ఇవ్వాలంటూ డిమాండ్ చేసే బాధితులను చీటర్లు టార్గెట్ చేస్తున్నారు. తమ డబ్బు తమకు రావాలంటే వాళ్లు చెప్పినట్లు చేయాలని కొందరు, తమ కుటుంబ సభ్యులు, తమ పేర్లతో బ్యాంకు ఖాతాలు తెరిచి చీటర్లకు అందిస్తున్నారు.
– సిటీబ్యూరో, మే 16 (నమస్తే తెలంగాణ)
క్రిప్టోగా మార్చేసి…
పార్ట్టైమ్ జాబ్ పేరుతో మోసాలు చేసి కోట్లు కొట్టేస్తున్న సైబర్ నేరగాళ్లు ఇలా అమాయకుల వద్ద నుంచి సేకరించిన బ్యాంకు ఖాతాలలోకి వాటిని డిపాజిట్ చేయిస్తున్నారు. బాధితులు అందులో డిపాజిట్ చేయగానే, తమ వద్ద ఉన్న ఇంటర్నెట్ బ్యాంకింగ్ వివరాలతో ఇతర ఖాతాల్లోకి బదిలీ చేసి, నగదును క్రిప్టోలోకి మార్చేస్తున్నారు. ఈ కేసుల విచారణలో పోలీసులు బ్యాంకు ఖాతాలను గుర్తించి, ఖాతాదారుడి వద్దకు వెళితే అమాయకులే ఉంటున్నారు. సైబర్ నేరగాళ్లు బ్యాంకు ఖాతాలు కావాలంటే ఇవ్వవద్దని పోలీసులు సూచిస్తున్నారు.
ఒక్కో ఖాతాకు రూ.30 వేలు..
నరేందర్ అనే వ్యక్తికి పార్ట్టైమ్ జాబ్ పేరుతో మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్కు స్పందించి, సైబర్ నేరగాళ్లు చెప్పినట్లు చేసి రూ.2 లక్షలు పోగొట్టుకున్నాడు. తిరిగి డబ్బులు ఇవ్వాలంటే తమకు ఐదు బ్యాంకు ఖాతాలు తెరించి ఆ వివరాలు ఇవ్వాలని సూచించారు. ఒక్కో ఖాతాకు రూ.30 వేలు ఇస్తామని తెలిపారు. దీంతో నరేందర్ తనతో పాటు తన కుటుంబ సభ్యుల పేర్లపై బ్యాంకు ఖాతాలు తెరిచి, వాటి ఇంటర్నెట్ బ్యాంకింగ్ వివరాలు పంపించారు. బాధితులకు మాత్రం తమ ఖాతాలోకి మోసం చేసిన డబ్బు డిపాజిట్ అవుతుందనే విషయం తెలియదు.