సూర్యాపేట, ఏప్రిల్ 18 : పాతాళం నుంచి పైపైకి ఉబికి వస్తున్న జలధారతో బోర్లు దంచికొడుతున్నాయి. వెరసి సమైక్యాంధ్ర పాలకుల హయాంలో తడారిన ఉమ్మడి నల్లగొండ జిల్లా నేడు కృష్ణా, గోదావరి జలాలతో తడిసిముద్దవుతున్నది. ఎటు చూసినా జల సవ్వడులు వినిపిస్తున్నాయి. పచ్చని పంట భూములు కనువిందు చేస్తున్నాయి. నాగార్జునసాగర్, మూసీ జలాశయాలు, డిండి, ఉదయసముద్రం, శాలిగౌరారం మధ్య తరహా ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తుండగా.. ఎస్సారెస్పీ కాల్వల్లో గోదావరి జలాలు ప్రవహిస్తున్నాయి. నాలుగేళ్ల కిందటి వరకు 32ఫీట్ల లోతులో చుక్కనీరు దొరకని కరువు నేలలో నేడు సగటున 3అడుగుల లోతులోనే గంగమ్మ జాడ దొరుకుతున్నది. వెరసి మండు వేసవిలోనూ ఉమ్మడి నల్లగొండ జిల్లా నిండుకుండను తలపిస్తున్నది.
చెరువులకు జలకళ..
సూర్యాపేట జిల్లాలో 1071చెరువులు, నల్లగొండలో 2001చెరువులు ఉన్నాయి సూర్యాపేటలో 902చెరువుల్లో 50శాతానికి పైగా నీటి నిల్వలున్నాయి 24చెరువులు అలుగు పోస్తున్నాయి. నల్లగొండ జిల్లాలో 1821 చెరువుల్లో 50శాతానికి పైగా నీరున్నది. దాదాపు 95చెరువులు అలుగు పోస్తున్నాయి. సూర్యాపేట, నల్లగొండ జిల్లాలో 2019మే నెల వరకూ భూగర్భ జలాల సగటు 13నుంచి 25అడుగుల లోతుగా ఉండేది. భూగర్భ జలాలు అడుగంటిపోయి ప్రజలు వేసవిలో తాగునీటికి సైతం తీవ్ర ఇబ్బందులు పడేవారు. సూర్యాపేట డివిజన్లోని మెజార్టీ గ్రామాల్లో కరువు పరిస్థితి తీవ్రంగా ఉండేది.
సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరి, నడిగూడెం, మోతె మండలాలతో పాటు నల్లగొండ జిల్లాలోని పలు మండలాల్లో భూగర్భ జలాలు సుమారు 31నుంచి 34అడుగుల లోతులో ఉండేవి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా ఎస్సారెస్పీ కాల్వల్లో గోదావరి జలాలు ప్రవహిస్తుండడంతో సూర్యాపేట జిల్లా సస్యశ్యామలం అయ్యింది. మరో వైపు మూసీ ప్రాజెక్టు ఆధునీకరించడంతో కుడి, ఎడమ కాల్వల ద్వారా నీటి విడుదలకు మార్గం సుగమమైంది. డిండి, ఉదయ సముద్రం, శాలిగౌరారం ప్రాజెక్టుల పరిధిలోని ఆయకట్టులో రెండు పంటలకు ఢోకా లేకుండా పోయింది.
కాళేశ్వరం జలం.. నిండుగా భూగర్భ జలం..
తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండలంలో 2019మే వరకు 32అడుగుల లోతులో ఉన్న భూగర్భ జలాలు 2020 మే నెలలో 4అడుగుల లోతుకు ఎగబాకాయి. ప్రస్తుతం మార్చి నెలలో సేకరించిన లెక్కల ప్రకారం సూర్యాపేట జిల్లా సగటు 6.35అడుగులుకాగా, తిరుమలగిరి మండలంలో 15అడుగుల లోతులో ఉన్నాయి. యాసంగి పనులు పూర్తయితే తిరిగి 4అడుగుల లోతుకు భూగర్భ జలాలు రానున్నాయి.
మా బోరు ఆగకుండా పోస్తున్నది
గతంలో ఎండాకాలంలో మా బోర్లు ఎండిపోయేవి. తాగడానికి కూడా నీళ్లు దొరక్క చాలా ఇబ్బందులు పడ్డాం. కానీ, రెండేండ్లుగా నీళ్లు పుష్కలంగా ఉంటున్నయి. కాళేశ్వరం నీళ్లు కాల్వల్లో పారుతున్నయి. భూగర్భ జలాలు పెరిగినయి. మనిషిలోతు ఎక్కడ తవ్వినా నీళ్లు కనబడుతున్నయి. మా బోరు ఆగకుండా పోస్తున్నది.
భూగర్భ జలం పెరిగింది..
అనుముల మండలం మదారిగూడేనికి చెందిన ఎండీ గౌస్కు సాగర్ ఆయకట్టులో ఎకరంన్నర భూమి ఉన్నది. ఎడమకాల్వకు నీటి విడుదల ఆలస్యమైతే సాగుకు ఇబ్బంది పడొద్దనే ఆలోచనతో మూడేండ్ల కిందట బావిని తవ్వించాడు. కానీ, ఏటా రెండు పంటలకు ఎడమకాల్వ నీరు సకాలంలో విడుదలవుతుండడంతో బావి అవసరం పడలేదు. ఏడాది పొడవునా బావిలో నీళ్లు నిలిచి ఉంటున్నాయి.
నిండుకుండను తలపిస్తున్న జాన్పహాడ్ ఊరచెరువు
పాలకవీడు మండలం జాన్పహాడ్ గ్రామంలోని ఊర చెరువు నిండుకుండను తలపిస్తున్నది. నాగార్జునసాగర్ ఎడమకాల్వ పరిధిలో జాన్పహాడ్ మేజర్ కింద ఉన్నప్పటికీ వానకాలమే సాగుకు దిక్కు ఉండకపోయేది. యాసంగి సాగు మొదలయ్యే నాటికి చెరువు ఎండిపోయేదని గ్రామస్తులు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చినంకనే సాగర్ కాల్వల ఆధునీకరణ, రెండు కార్లకు సాగునీరు ఇవ్వడంతో ఊర చెరువు నీటికళను సంతరించుకున్నదని పేర్కొంటున్నారు. చెరువులో నీరు దండిగా ఉండడంతో భూగర్భజలాలు పెరిగి బావులు నిండి పొలాల్లో జాలు పారుతుందని తెలిపారు.