హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): సొంత జాగాలు ఉండి ఇండ్లు కట్టుకొనేందుకు ముందుకొచ్చేవారికి ఆర్థిక మద్దతు అందించేందుకు కట్టుబడి ఉన్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. త్వరలో ఈ పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. సంక్షేమ పథకాల అమలుపై శుక్రవారం శాసనసభలో సీఎం మాట్లాడారు. ‘సొంత జాగాలున్నవారికి కొంత ఆర్థికసాయం చేస్తే ఇండ్లు కట్టుకొంటారని మా ఎమ్మెల్యేలు అడుగుతున్నారు. గత ఎన్నికల్లో కూడా చెప్పాం. ఆ పథకం మీద పని చేస్తున్నాం. కరోనా వల్ల ఆలస్యమైంది. వందశాతం త్వరలో ప్రారంభిస్తాం’ అని స్పష్టంచేశారు. నియోజకవర్గానికి వెయ్యి లేదా 1200 ఇండ్లు.. ఇలా ఎన్ని ఇవ్వాలో ఆలోచిస్తున్నామని తెలిపారు. కొన్ని కాలనీవాసులకు గతంలో 60, 100 గజాలకు సర్టిఫికెట్లు ఇచ్చినా ఇండ్లు కట్టుకొనేందుకు అనుమతులు ఇవ్వడం లేదని చెప్తున్నారని, ఈ సమస్య ఎక్కువగా హైదరాబాద్ చుట్టూ ఉన్నదని చెప్పారు. దీనిపై వెంటనే సమీక్షించి, సర్టిఫికెట్ ఉండి, భూమి ఉంటే తక్షణం ఇంటి నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని సీఎస్కు చెప్పినట్టు వెల్లడించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం మొత్తం రూ.19,120 కోట్లు విడుదల చేశామని, హైదరాబాద్లో 7, 9 అంతస్తుల్లో లిఫ్ట్లు పెట్టి ఇండ్లు కడుతున్నామని, ఇలాంటివాటి ధర రూ.11 లక్షలు ఉన్నప్పటికీ పేదలు ఆత్మగౌరవంతో బతకాలని ఖర్చుకు వెనకాడటం లేదన్నారు. గతంలో మంథనిలో 100 మందికి ఇండ్లు అవసరం ఉంటే 140 మందికి మంజూరు చేశారని, అంత ఘోరంగా పరిస్థితులు ఉండేవని గుర్తుచేశారు. ‘అందుకే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో ఏ ఒక్క ఎమ్మెల్యే జోక్యం చేసుకోవద్దని చెప్పిన. ‘ఎవరికి వచ్చినా మీ నియోజకవర్గం వారికే వస్తుంది కదా’ అని చెప్పిన’ అని సీఎం తెలిపారు.
అసైన్డ్ ల్యాండ్స్ను వీలైనంత వరకూ తీసుకోవద్దని అధికారులకు చెప్పిన. తప్పని పరిస్థితిలో తీసుకుంటే ఇతరులకు ఎంత నష్టపరిహారం ఇస్తరో వారికీ అంత ఇవ్వాలని ఆదేశించిన. వీలైనంత మేరకు తీసుకున్న భూమికి సమానమైన భూమి ఇవ్వాలని చెప్పాం. అనవసరంగా తీసుకుంటే తప్పకుండా నిరోధిస్తం. ఈ విషయంలో నేను భూ యజమానుల వెంట ఉంటా
–సీఎం కేసీఆర్