హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో పెట్టుబడులపై మంత్రి కేటీఆర్తో జరిపిన చర్చలు అద్భుతంగా సాగాయని, ఇది తనకొక గొప్ప అనుభవమని కిటెక్స్ గార్మెంట్స్ సీఎండీ సాబు ఎం జాకబ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో పర్యటన సందర్భంగా శుక్రవారం ఆయన ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ‘మంత్రి కేటీఆర్తో చర్చలు అద్భుతంగా జరిగాయి. పెట్టుబడుల విషయమై ఇంతకుముందు ఇతర రాష్ర్టాల ప్రభుత్వాలతో నేను జరిపిన చర్చల కన్నా పూర్తి భిన్నంగా సాగాయి. కేటీఆర్ నేతృత్వంలోని బృందంతో జరిగిన ఈ చర్చలు కొత్త అనుభవాన్నిచ్చాయి’ అని పేర్కొన్నారు. రాష్ర్టానికి పెట్టుబడులు తీసుకురావాలని, ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని మంత్రి కేటీఆర్ పరితపిస్తున్నారని, ఆయన ఏ పని చేసినా నూరుశాతం అంకితభావంతో పనిచేస్తారని అర్థమయ్యిందని ప్రశంసించారు. త్వరలో మరోసారి రాష్ట్రంలో పర్యటించనున్నట్టు చెప్పారు. ఈసారి వరంగల్ పర్యటనకు మంత్రి కేటీఆర్ కూడా తమతోపాటు వస్తారని, ఈ మేరకు ఆయన హామీ ఇచ్చారని చెప్పారు. కలెక్టర్తోపాటు సంబంధిత అధికారులందరితో సమావేశం ఏర్పాటు చేసి అన్ని అనుమానాలను నివృత్తి చేస్తామని, భూమి కేటాయింపు తదితర అంశాలపై పూర్తి స్పష్టత ఇస్తామని చెప్పారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసి తమను తీసుకురావడంపై జాకబ్ స్పందిస్తూ.. పెట్టుబడుల విషయంలో తెలంగాణ మాదిరిగా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇంత వేగంగా నిర్ణయాలు తీసుకోవడం చాలా అరుదని పేర్కొన్నారు. కేరళ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తమ సంస్థపై అధికారులతో దాడులు చేయించి ఇబ్బందులకు గురి చేస్తున్నదని, అందుకే ఆ రాష్ట్రం నుంచి వైదొలుగుతున్నామని తెలిపారు. ప్రపంచం మారిపోయిందని, కానీ కేరళ మాత్రం 50 ఏండ్లు వెనుకబడిందని జాకబ్ ధ్వజమెత్తారు.