హైదరాబాద్ : విద్యారంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. తెలంగాణలో విద్యారంగాన్ని సంపూర్ణంగా, సమగ్రంగా ఉన్నతీకరిస్తూ.. రూ. 4 వేల కోట్లతో సరికొత్త విద్యాపథకాన్ని ఈ బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నట్లు ఆర్థిక మంత్రి హరీష్ రావు తెలిపారు. రాబోయే రెండేళ్లలో రాష్ర్టంలోని అన్ని రకాల ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల నిర్మాణం పెద్ద ఎత్తున చేపట్టబోతున్నట్లు ప్రకటించారు. పాఠశాలలకు అవసరమైన భవనాలు, వాటి మరమ్మతులు, కావాల్సిన ఫర్నీచర్, టాయిలెట్లు వంటి వసతులు కల్పించాలని నిర్ణయించింది. ఆధునిక సాంకేతిక విజ్ఞానంతో పాఠశాల తరగతులను అనుసంధానం చేస్తుందని మంత్రి ప్రకటించారు. ఈ బృహత్తర విద్యాపథకం కోసం ఈ ఏడాది రూ. 2 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. దీంతో పాటు పాఠశాల విద్యకు రూ. 11,735 కోట్లు, ఉన్నత విద్యా రంగానికి రూ. 1,873 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు.
రాష్ర్టంలోని ఎస్సీ గురుకులాల్లో 1,45,985 మంది విద్యార్థులు చదువుతున్నారని పేర్కొన్నారు. ఎస్సీ గురుకులాల కోసం 2014లో రూ. 590.60 కోట్లు ఖర్చు చేయగా, 2019-20 నాటికి రూ. 898 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. 2014లో గిరిజన విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన గురుకులాలు 96 ఉంటే.. 2021 నాటికి 133కు పెంచామన్నారు. ప్రస్తుతం గిరిజన గురుకులాల్లో 66,943 మంది విద్యార్థులు చదువుతున్నారు. 2020-21 నాటికి గిరిజన గురుకులాలకు రూ. 529.60 కోట్లు వెచ్చించినట్లు పేర్కొన్నారు. డిగ్రీ స్థాయిలో గురుకుల కాలేజీలు ఏర్పాటు చేశామన్నారు. నేడు తెలంగాణ గురుకుల విద్యాలయాల నుంచి 189 మంది విద్యార్థులు ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లను సాధించారు. అలాగే 170 మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఐఐటీ, జేఈఈ సీట్లను సాధించి రాష్ర్ట కీర్తిని పెంచారని ప్రశంసించారు. బీసీ గురుకులాల్లో లక్షా 13 వేల 280 మంది విద్యార్థులు చదువుతుండగా, 2021లో రూ. 545 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు.