హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రం లో త్వరలో డ్రోన్ పాలసీ తీసుకురానున్నట్టు ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు ప్రకటించారు. ఇటీవల వరల్డ్ ఎకనామిక్ ఫోరం, నీతి ఆయోగ్, ఇతర సంస్థలతో కలిసి దేశంలోనే తొలిసారిగా వికారాబాద్లో ‘మెడిసిన్ ఫ్రమ్ ద స్కై’ ప్రాజెక్టును ప్రారంభించిన విషయాన్ని గుర్తుచేశారు. ఇదే స్ఫూర్తితో డ్రోన్ టెక్నాలజీని మరింత ప్రోత్సహించేందుకు దేశంలోనే మొదటిసారిగా డ్రోన్ పాలసీని తీసుకొస్తామని చెప్పారు. దీంతోపాటు త్వరలో రాష్ట్రంలో డ్రోన్ టెస్టింగ్ కారిడార్ను ఏర్పాటు చేస్తామన్నారు. హైదరాబాద్ ఆదిభట్లలోని ‘టాటా-లాక్హీడ్ మార్టిన్ ఏరోస్ట్రక్చర్స్ లిమిటెడ్’ (టీఎల్ఎంఏఎల్) సంస్థ ‘సీ-130జే సూపర్ హెర్క్యులస్’ ఎయిర్క్రాఫ్ట్కు చెందిన 150వ ఎంపెన్నేజ్ (తోక భాగంలోని ఒక రెక్క)ను ఉత్పత్తి చేసింది. ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. 20కి పైగా దేశాల్లో వినియోగిస్తున్న సీ-130జే ఎయిర్క్రాఫ్ట్లకు హైదరాబాద్లో 150వ ఎంపెన్నేజ్ను తయారు చేయడం గొప్ప విషయమన్నారు. ఈ విజయంలో భాగస్వాములైన యాజమాన్యాన్ని, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. టాటా ఏరోస్పేస్ లిమిటెడ్, లాక్హీడ్ మార్టిన్ ఏరోనాటిక్స్ సంయుక్తంగా హైదరాబాద్లో టీఎల్ఎంఏఎల్, టాటా సికోర్సై ఏరోస్పేస్ లిమిటెడ్ను ఏర్పాటు చేసి బిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టాయని, వెయ్యి మందికిపైగా ఉపాధి కల్పిస్తున్నాయని చెప్పారు. సీ-130ఏ ఫైటర్స్ తయారీకి హైదరాబాద్ కేంద్రంగా ఉండటం గర్వంగా ఉన్నదన్నారు. ఈ ఎయిర్క్రాఫ్ట్లో 85 శాతానికిపైగా హైదరాబాద్లోనే ఉత్పత్తి అవుతున్నదని, ఇందులో సుమారు 300కుపైగా కంపెనీలు, విక్రయకర్తలు భాగస్వామిగా ఉన్నారని వెల్లడించారు.
డిఫెన్స్/ఏరోస్పేస్ ఇంక్యుబేటర్, ఎక్సలెన్స్ సెంటర్
విమాన, రక్షణ రంగాల్లో తెలంగాణ యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించాలన్నదే తమ లక్ష్యమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కొత్త ఆవిష్కరణలను, ఆలోచనలను తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ ప్రోత్సహిస్తుందని, ఇందులో భాగంగా కంపెనీలు, విద్యాసంస్థలతో కలిసి రాష్ట్రంలో ‘ఏరోస్పేస్ డిఫెన్స్ యూనివర్సిటీ’ లేదా ‘ఎక్సలెన్స్ సెంటర్’ను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ప్రకటించారు. ఇది మేధావులైన యువతీయువకులను గుర్తించి నిపుణులుగా తీర్చిదిద్దుతుందని తెలిపారు. దీంతోపాటు ఈ రెండు రంగాల్లో ఆవిష్కరణలను ప్రోత్సహించడంపైనా దృష్టిపెట్టామన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో డీఆర్డీవో సహా అనేక డిఫెన్స్ ల్యాబ్స్, రక్షణ రంగ పరిశ్రమలు ఉన్నాయని గుర్తుచేశారు. వీటన్నిటి సహకారంతో రాష్ట్రంలో ‘డిఫెన్స్/ఏరోస్పేస్ ఇంక్యుబేటర్’ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇది స్టార్టప్లు, మినీ స్టార్టప్లను ప్రోత్సహిస్తుందన్నారు. అమెరికాకు చెందిన బోయింగ్, లాక్హీడ్ మార్టిన్ లాంటి ప్రముఖ విమాన తయారీ సంస్థలు హైదరాబాద్లో క్లస్టర్లను ఏర్పాటు చేశాయని మంత్రి కేటీఆర్ గుర్తుచేస్తూ.. అమెరికా-భారత్ మధ్య మైత్రికి రాష్ట్రం ఒక చిహ్నంగా నిలుస్తున్నదని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఐటీశాఖ కార్యదర్శి జయేశ్రంజన్, లాక్హీడ్ మార్టిన్ ఇండియా సీఈవో విలియం బ్లేర్, టీఏఎస్ఎల్ సీఎండీ సుకరన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
ఇంజిన్ క్లస్టర్గా తెలంగాణ
రాష్ట్రంలో విమానయాన (ఏరోస్పేస్), రక్షణ (డిఫెన్స్) రంగాలు ఏడేండ్లుగా అనూహ్య వృద్ధి సాధిస్తున్నాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అనుకూల పాలసీలు, అంతర్జాతీయస్థాయి మౌలిక సదుపాయాలు, నిపుణులైన మానవవనరులు తెలంగాణను పెట్టుబడులకు ఆకర్షకప్రాంతంగా మార్చాయని తెలిపారు. ఫలితంగా ఇప్పటికే అనేక జాతీయ, అంతర్జాతీయ విమానయాన సంస్థలు తెలంగాణలో తమ యూనిట్లను ఏర్పాటుచేశాయని చెప్పారు. త్వరలో మరిన్ని పెట్టుబడు లు రానున్నాయని అన్నారు. రాష్ట్రం ఏరో ఇంజిన్ క్లస్టర్ గా ఎదుగుతున్నదని చెప్పారు. కరోనా విపత్తు సమయం లో అనేక సంస్థల కార్యకలాపాలు ఆపేసినా.. రాష్ట్రంలోని యూనిట్లు మాత్రం ఉత్తత్తికి ఆటంకం కలుగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాయని అభినందించారు. హైదరాబాద్లోని టాటా-బోయింగ్ క్లస్టర్లో ఏహెచ్-64 అపాచీ హెలికాప్టర్ ఫ్యూజ్లేజ్లు ఉత్పత్తి అవుతున్నాయని గుర్తుచేశారు. అమెరికా అధ్యక్షుడు వినియోగించే హెలికాప్టర్ క్యాబిన్ హైదరాబాద్లో తయారవుతున్నదని, ఇదే విషయాన్ని ఇటీవల కేంద్ర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు తెలిపానన్నారు. దీనికి ఆయన స్పందిస్తూ.. ‘కేవలం క్యాబిన్ మాత్రమే కాకుండా మొత్తం హెలికాప్టర్ హైదరాబాద్లో తయారు కావాలి’ అని సూచించారని, ఇది త్వరలోనే నెరవేరాలని కోరుకొంటున్నానని మంత్రి కేటీఆర్ చెప్పారు. అంతరిక్ష రంగంలోనూ హైదరాబాద్ తనదైన ముద్రవేస్తున్నదని, శుక్రగ్రహంపై పరిశోధనల కోసం ఇస్రో ప్రయోగించిన ‘మామ్’లో 30 శాతానికిపైగా విడిభాగాలు ఇక్కడి కంపెనీలే ఉత్పత్తి చేశాయని గుర్తుచేశారు.